కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడతాం.. | We will save our party leaders | Sakshi
Sakshi News home page

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడతాం..

Oct 23 2016 4:59 PM | Updated on May 25 2018 9:20 PM

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడతాం.. - Sakshi

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడతాం..

తమ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలినా సహించేది లేదని వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ టీడీపీ శ్రేణులను హెచ్చరించారు.

* టీడీపీ శ్రేణులను హెచ్చరించిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స
అమరావతిలో పెదకూరపాడు నియోజకవర్గ సమావేశం 
 
అమరావతి: తమ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలినా సహించేది లేదని వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. పెదకూరపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం, అమరావతి పట్టణ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు విన్నకోట శివయ్య ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి జరిగాయి. స్థానిక పల్లపు వీధిలోని డాల్‌ మిల్లులో నిర్వహించిన ఈ బహిరంగసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొత్స మాట్లాడుతూ.. సొంత అవసరాల కోసమే పనిచేస్తున్న టీడీపీ నేతలు ప్రజలను పట్టించుకోవడం మాని తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై ఈగ వాలినా సహించబోమన్నారు. పార్టీ అధికార ప్రతి నిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ..  నిన్న కాక మొన్న పుట్టిన లోకేష్‌ కుమారుడు పేరుతో కోట్లు ఎలా ఉన్నాయని నిలదీశారు. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..  ఎమ్మెల్యే శ్రీధర్‌ ఇసుక, మట్టితో పాటు చివరికి దేవుడి భూములను సైతం వదల్లేదని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో  ప్రజల మధ్య  టీడీపీ ఎమ్మెల్యేలు చిచ్చుపెడుతున్నారని అన్నారు. టీడీపీ ఓట్లు వేసిన వారికే సంక్షేమ పథకాలు వర్తింపచేస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగమనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. తాను చివరివరకు వైఎస్సార్‌ సీపీలోనే ఉంటానని చెప్పారు.
 
మంత్రి అనుచరులే నకిలీ విత్తనాల దొంగలు.. 
వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులే నకిలీ విత్తనాల దందా చేసి రైతులను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ చెప్పారు. ఇసుక, మట్టి అక్రమాల్లో  టీడీపీ నేతలది అందెవేసిన చెయ్యి అన్నారు. గతంలో పనిచేసిన తహసీల్దార్, సీఐ  ఎమ్మెల్యే శ్రీధర్‌కు తొత్తులుగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశార న్నారు. 
– మర్రి రాజశేఖర్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement