
వాటర్ ట్యాంకర్ బోల్తా : డ్రైవర్ మృతి
మండలంలోని ఆర్కపల్లి నల్లకుంటచెరువులో మిషన్ కాకతీయ పనులు చేస్తుండగా ఆదివారం చెరువుకట్టపై నుంచి వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది.
మాడ్గుల: మండలంలోని ఆర్కపల్లి నల్లకుంటచెరువులో మిషన్ కాకతీయ పనులు చేస్తుండగా ఆదివారం చెరువుకట్టపై నుంచి వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సంజునాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కలకొండ పంచాయితీ పరిధిలోని గోప్యాతండాకు చెందిన ఇస్లావత్ సంజునాయక్ (25) అన్నెబోయిన్ పలి్లకి చెందిన ఓ వాటర్ ట్యాంకర్పై డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
నల్లకుంట చెరువులో మిషన్ భగీరథ పనుల కాంట్రాక్టర్ ఆరోగ్యరెడ్డి ఈ వాటర్ ట్యాంకర్ లీజుకు తీసుకున్నాడు. చెరువుకట్టను క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్ కట్టపై నుంచి బోల్తాపడింది. డ్రైవర్ సంజునాయక్ ఇంజన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య జ్యోతి, కుటుంబసభ్యులు, బంధువుల సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం చూసి రోదించారు.
బంధువుల అందోళన..
ట్యాంకర్ బోల్తాపడి మృతిచెందిన డ్రైవర్ సంజునాయక్ కుటుంబానికి న్యాయం చేసే వరకు శవాన్ని తీసేది లేదని మృతుడి బంధువులు సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. గిరిజన నాయకుల పెద్దలు మిషన్ భగీరథ కాంట్రాక్టర్, ట్యాంకర్ యజమానులతో రాత్రి 7గంటలవరకు చర్చించగా రూ.4లక్షల పరిహారం అందిస్తానని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో బంధువుల శాంతించారు. జేసీబీ సహాయంతో మృతదేహం తీశారు. మృతుడికి భార్యజ్యోతి, రెండేళ్ల కూతురు ఉంది.