తీవ్ర ఉత్కంఠతను రేపిన కోదాడ పెద్ద చెరువు మత్స్యసహకార సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
నామినేషన్లు ఉపసంహరించుకున్న వీరస్వామి వర్గం
9 మంది డైరెక్టర్ల ఏకగ్రీవం
28న అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక
కోదాడ
తీవ్ర ఉత్కంఠతను రేపిన కోదాడ పెద్ద చెరువు మత్స్యసహకార సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సొసైటీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన మాజీ అధ్యక్షుడు కందరబోయిన వీరస్వామి ఫ్యానల్ మంగళవారం నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈ ఎన్నికలు ఏకగీవ్రమయ్యాయి. సొసైటీలో ఉన్న 9 డైరెక్టర్ పోస్టులకు గాను మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన మంగళవారం వీరస్వామి వర్గంతో పాటు మొత్తం 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన 9మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సూర్యదత్ తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు వేముల రాముడు, గాదె మధు, ఐతబోయిన ధనమూర్తి, సింగం శ్రీనివాసరావు, పొనుగోటి ధనమూర్తి, రెడ్డి బోయిన రంగయ్య, గాదె నాగయ్య, పులిదాసు వెంకటేశ్వర్లు, శీలంచిన వెంకటయ్యలు ఈ నెల 28న సమావేశమై సొసైటీ అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. మొదటి నుంచి అనుకున్నట్లుగానే కోదాడకు చెందిన వేముల రాముడును అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ డైరెక్టర్లను కోదాడ నియోజకవర్గ ఇన్చార్జీ కె. శశీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, కరెంటు రామిరెడ్డి, పారసీతయ్య తదితరులు అభినందించారు.
చక్రం తిప్పిన ఇన్చార్జి, నకిరేకల్ ఎమ్మెల్యే..
కోదాడ మత్స్యసహకార సొసైటీకి ఐదేళ్ల తరువాత జరగుతున్న ఎన్నికలు అధికార పార్టీకి మొదట పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు పోటీ పడడంతో వారిని సముదాయించడానికి కోదాడ నియోజకవర్గ ఇన్చార్జీ కె.శశీధర్రెడ్డితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రంగంలోకి దిగారు. ఇరువర్గాలతో చర్చించి ఒక వర్గాన్ని నామినేషన్ ఉపసంహరించుకొనేలా చేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే చందర్రావు, కరెంటు రామిరెడ్డి కూడా ఈ ఎన్నకల్లో కీలకంగా వ్యవహరించారు.