అంత్యక్రియలకు వెళుతూ.. | Three man died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Aug 19 2016 12:09 AM | Updated on Sep 28 2018 3:41 PM

అంత్యక్రియలకు వెళుతూ.. - Sakshi

అంత్యక్రియలకు వెళుతూ..

అంత్యక్రియలకు వెళుతూ మరో కుటుంబం అనంతలోకాలకు వెళ్లింది.

కనగల్‌(నల్గొండ): అంత్యక్రియలకు వెళుతూ మరో కుటుంబం అనంతలోకాలకు వెళ్లింది. ఈ సంఘటన కనగల్‌ మండలం సాగర్‌రోడ్డులోని బాబసాహెబ్‌గూడెం స్జేజీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.  చండూర్‌ సీఐ రమేశ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... హాలియాలో బంధువు మృతి చెందడంతో డిండి మండలం గోనబోయినపల్లి, బొగ్గులదొనలకు చెందిన 9 మంది ఆటోలో నల్లగొండ నుంచి సాగర్‌ రోడ్డులో వెళుతుండగా బాబసాహెబ్‌గూడెం స్టేజీ సమీపంలోకి రాగానే ముందుగా వెళుతున్న బైక్‌ ఆకస్మికంగా కిందపడింది. దీనిని తప్పించబోయే క్రమంలో ఆటో అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న  డిండి మండలం గోనబోయినపల్లికి   చెందిన పదర రాము(30), అతని భార్య రేణుక(24) కొడుకు వెంకట్‌(3) మృతి చెందారు. రేణుక అక్కడికక్కడే మృతిచెందగా రాము, వెంకట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. రాము పెద్ద కొడుకు చరణ్‌తేజ్‌ తలకు గాయమై ప్రాణాలతో బయటపడగా వదిన పుష్పకు తీవ్రగాయాలయ్యాయి. అదే మండలం బొగ్గులదొనకు చెందిన రాము అత్త ముప్పళ్ల చంద్రకళ,  ముప్పళ్ల విజయతోపాటు వారి పిల్లలు హరిప్రసాద్, హారికలకు తీవ్రగాయాలయ్యాయి. రాము తన కుటుంబంతో గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ సొంత ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  ప్రమాదంతో ఆటో నుజ్జు నుజ్జు కావడంతోపాటు కారు ముందు భాగం దెబ్బతింది.  సంఘటనా స్థలాన్ని నల్లగొండ డీఎస్పీ సుధాకర్‌ పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement