వంతులవారీ విధానంతో కష్టాలు
చేలకు నీరందక అన్నదాతల అవస్థలు
దువ్వ చానల్లో పేరుకుపోయిన కర్ర నాచు
తణుకు టౌన్ :
వంతులవారీ విధానం రైతులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. గోదావరిలో పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో లేకపోవడంతో జల వనరుల శాఖ అధికారులు వంతులవారీ విధానంలో కాలువలకు నీరందిస్తున్నారు. కాలువల్లో కర్ర నాచు పెరిగిపోవడం, నీటిమట్టాలు దిగువ స్థాయిలో ఉండటంతో దాళ్వా పంటకు వంతు సమయంలోనూ నీరందటం లేదు. ముఖ్యంగా అత్తిలి, జీ అండ్ వీ కెనాల్ ఆయకట్టు పరిధిలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. తణుకు నియోజకవర్గంలో దువ్వ చానల్ ద్వారా తణుకు మండలం దువ్వ, అత్తిలి మండలం వరిఘేడు, తిరుపతిపురం, బి.కొందేపాడు, ఎగువన ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి, సూర్యారావుపాలెం ఆయకట్టు పొలాలకు సాగునీరు అందటం లేదు. ఈ కాలువకు ఇచ్చిన వంతు సమయంలో అతి స్వలంగానే చేలకు నీరు వచ్చింది. జనవరి 27నుంచి వంతు ముగియడంతో ఈ కాలువ ఆయకట్టు పరిధిలోని చేలు తడారి ఎండిపోతున్నాయి.
కర్ర నాచుతో అవస్థలు
సాగుకు సమాయత్తం కార్యక్రమం పేరిట పశ్చిమ డెల్టాలో పలు కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టినా దువ్వ కాలువను పూర్తిగా వదిలేశారు. పూడిక పేరుకుపోవడం, కర్రనాచు పెరగడంతో
ఈ కాలువలో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. ఫలితంగా శివారు ప్రాంతాలైన వరిఘేడు, తిరుపతిపురం, బి.కొండేపాడు ఆయకట్టులోని పొలాలకు నీరందక ఎండుతున్నాయి.
ఽ
రైతులపైనే భారం
పూడిక, కర్రనాచు తొలగింపు పనులను జల వనరుల శాఖ చేపట్టాల్సి ఉండగా.. అధికారులు గాలికొదిలేశారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దిక్కులేని పరిస్థితుల్లో వరిఘేడు, తిరుపతిపురం, బి.కొండేపాడు నీటి సంఘాల బాధ్యుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది రైతులు కాలువలోని కర్రనాచును స్వచ్ఛందంగా తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. పసలపూడిలో గొడిచర్ల లాకుల నుంచి ఈ పనులు చేపట్టారు. దువ్వ, తిరుపతిపురం, వరిఘేడు, బి.కొండేపాడు గ్రామాలకు చెందిన రైతులు వ్యయప్రయాసలతో కర్ర నాచు తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. డెల్టాలో నవంబర్లో చేపట్టిన కాలువల తవ్వకం, నాచు తొలగింపు పనులను ఈ కాలువ పరిధిలో చేయకపోవడం వల్ల తమకు ఈ కష్టాలొచ్చాయని రైతులు వాపోతున్నారు. ఈ కాలువలో పనులు చేపట్టకపోవడం వల్ల సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. వరినాట్లు పూర్తిచేసి నెల రోజులైనా ఇప్పటికీ మొదటి విడత ఎరువులు వేయలేదని, ప్రస్తుతం రెండవ విడత ఎరువులు వేయాల్సి ఉన్నా నీరు సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు చేలు ఎండిపోవడం, మరోవైపు కలుపు పెరిగిపోవడంతో పంటల్ని కాపాడుకునేందుకు అంతా కలిసి కాలువను ప్రక్షాళన చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
చేలు ఎండిపోతున్నాయ్
వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా కొన్ని చేలలో మొదటి విడత ఎరువులు చల్లలేదు. కొన్ని పొలాల్లో ఎరువులు వేసినా.. సాగు నీరందక కలుపు విపరీతంగా పెరిగిపోయింది. మొదట్లోనే ఈ కాలువలో పూడిక తీయిస్తే ఈ రోజున ఇబ్బందులు వుండేవి కాదు.
బోడపాటి వెంకట సూర్యనారాయణ, నీటి సంఘం డైరెక్టర్, వరిఘేడు, అత్తిలి మండలం
నీరందట్లేదు
వరి చేలకు సాగు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దాళ్వా పంటకు ఇప్పుడే ఇలా వుంటే మున్ముందు ఇంకెన్ని కష్టాలు పడాలోనని భయంగా ఉంది. సాగు నీటి కోసం రాత్రి పగలు తేడా లేకుండా కాలువ గట్ల వెంట తిరిగినా ఫలితం ఉండటం లేదు. దువ్వ చానల్లో నీటిమట్టం తక్కువగా రావడంతో చేలకు నీరు సరిపోవడం లేదు. కాలువలో పెరిగిపోయిన కర్ర నాచు వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు.
దొంగ వెంకటేశ్వరరావు, నీటి సంఘం డైరెక్టర్, తిరుపతిపురం, అత్తిలి మండలం
దువ్వ కాలువపై నిర్లక్ష్యం
వరి పంటకు సాగు నీరందించే విషయంలో అధికారులు దువ్వ కాలువను నిర్లక్ష్యం చేస్తున్నారు. వంతులవారీ విధానంలో నీరిచ్చనా.. నాలుగు రోజులుగా నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. మొదటి నుంచీ ఈ కాలువలో పూర్తిస్థాయి నీటి ప్రవాహం లేదు. పొలాలు అరకొరగానే తడుస్తున్నాయి. కొన్నిచోట్ల బీటలు వారుతున్నాయి. అధికారులు స్పందించి కాలువలో ఉన్న కర్ర నాచును పూర్తి స్థాయిలో తొలగించాలి.
అరిగెల బాబి, వైఎస్సార్ సీపీ నాయకుడు, దువ్వ
సాగు ఆలస్యమవుతుందని..
దువ్వ చానల్లో పేరుకుపోయిన కర్ర నాచును తొలగించడానికి.. కాలువ తవ్వడానికి ప్రతిపాదనలు చేశాం. అయితే, సాగు ఆలస్యమవుతుందని రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆ పనులు చేపట్టలేదు. ప్రస్తుత వంతులవారీ విధానంలో నీటిమట్టం తగ్గడంతో శివారు పొలాలకు సాగు నీరందడం కష్టంగా ఉంది. రైతులు కర్ర నాచు తొలగించుకుంటున్నారు కాబట్టి ఇబ్బందులు తొలగిపోతాయి.
జీఎస్ హరికిషన్, ఇరిగేషన్ ఏఈ, తణుకు