ముగిసిన శత చండీయాగం | sata chandi yagam | Sakshi
Sakshi News home page

ముగిసిన శత చండీయాగం

Nov 20 2016 10:16 PM | Updated on Sep 4 2017 8:38 PM

ముగిసిన శత చండీయాగం

ముగిసిన శత చండీయాగం

దుర్గగుడిలో జరుగుతున్న శత చండీయాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. లోకకల్యాణార్థం దుర్గగుడి అధికారులు ఈనెల 16వ తేదీన యాగాన్ని ప్రారంభించారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడిలో జరుగుతున్న శత చండీయాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. లోకకల్యాణార్థం దుర్గగుడి అధికారులు ఈనెల 16వ తేదీన యాగాన్ని ప్రారంభించారు. యాగం తొలిరోజునే వర్షం కురియడం శుభదాయకమని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఆదివారం  మధ్యాహ్నం అర్జున వీధిలోని మహామండపం సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ రుత్వికులు , వైదిక కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈవో సూర్యకుమారి, ఏఈవో అచ్యుతరామయ్య దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం ఈవో సూర్యకుమారి దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. పూర్ణాహుతి కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా హాజరయ్యారు. దేవస్థాన అభివృద్ధికి భక్తులు ఇచ్చే విరాళాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈవోకు సూచించారు. పుష్కరాల ముందు ప్రారంభించిన అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదానం విభాగంపై మళ్లీ ఆరోపణలు వస్తున్నాయని, మీడియాలో వస్తున్న కథనాలను పాజిటివ్‌గా తీసుకుని అందులో లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు.
ఆది దంపతుల శాంతి కల్యాణం
శత చండీయాగం పూర్తి కావడంతో ఆదివారం సాయంత్రం మహామండపంలో ఆది దంపతుల శాంతి కల్యాణం జరిగింది. గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల దివ్య లీలా కల్యాణోత్సవంలో అర్చకులు కన్యాదాతలుగా వ్యవహరించగా, ఈవో సూర్యకుమారితో పాటు పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement