శేషాచలం అడవుల్లో పోలీసులపై రాళ్లదాడి | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవుల్లో పోలీసులపై రాళ్లదాడి

Published Wed, Jan 27 2016 4:13 AM

Red scanders attack with Stones on Taskforce police

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మంగళవారం కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్లదాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం వారిమెట్టు సమీపంలోని సచ్చినోడిబండ వద్ద శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో టాస్క్‌ఫోర్స్‌కు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దాంతో ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వారు.

అప్రమత్తమైన పోలీసులు ఒక రౌండు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సందర్బంగా ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకోవడంతో పాటు 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు సంఘటన స్థలానికి బయలుదేరారు.

Advertisement
Advertisement