ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు నిప్పులు చెరిగారు.
విజయవాడ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు నిప్పులు చెరిగారు. గురువారం విజయవాడలో రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ... తెలంగాణకు చెందిన మందకృష్ణకు ఏపీలో రాజకీయాలు చేసే అర్హత లేదన్నారు.
మందకృష్ణ చేస్తున్న అద్దె నాయకత్వం తమ రాష్ట్రంలో దళితులకు అవసరం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే ముద్రగడ, మందకృష్ణలు కులరాజకీయాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. అందుకే ఏపీకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తున్నారంటూ మందకృష్ణపై రావెల ఆగ్రహం వ్యక్తం చేశారు.