ఒంటరిగా ఉన్న పిల్లలను మాయమాటలతో మభ్యపెట్టి దాదాపు 10 తులాల బంగారు ఆభరణాలను ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం కాజీపేట పరిధిలోని ప్రశాంత్నగర్ కాలనీలో చోటుచేసుకుంది.
పిల్లలను మభ్యపెట్టి.. నగలు దోచేశాడు
Jul 26 2016 11:45 PM | Updated on Aug 30 2018 5:27 PM
కాజీపేట : ఒంటరిగా ఉన్న పిల్లలను మాయమాటలతో మభ్యపెట్టి దాదాపు 10 తులాల బంగారు ఆభరణాలను ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం కాజీపేట పరిధిలోని ప్రశాంత్నగర్ కాలనీలో చోటుచేసుకుంది. దీనిపై బాధితుడు గుండారపు జైపాల్రెడ్డి కాజీపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్నగర్ కాలనీలో నివసించే జైపాల్రెడ్డి కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో టీచర్గా, ఆయన భార్య ఉషారాణి సైదాపూర్ మండలంలో వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు ఆకాశ్రెడ్డి, జాన్రెడ్డి ప్రశాంత్నగర్ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుతున్నారు. రోజులాగే జైపాల్రెడ్డి దంపతులు మంగళవారం కూడా ఉద్యోగ విధులకు వెళ్లారు. అయితే మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో వీరి ఇద్దరు పిల్లలు ఇంటి వద్దే ఉన్నారు. ఈక్రమంలో ఇంటిపక్కనే ఉండే మరో మిత్రుడు రుషికుమార్ను పిలుచుకొని కంప్యూటర్లో గేమ్స్ ఆడసాగారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఓ అపరిచిత వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. ‘మీ నాన్నగారు పంపించారు. బీరువాలో ఉన్న బంగారు నగల్ని మరమ్మతు చేయమన్నారు’ అంటూ ఆ గుర్తు తెలియని వ్యక్తి పిల్లలకు చెప్పాడు. ఆ మాయమాటలను నమ్మిన చిన్నారులు బీరువాలో వెతికినా బంగారం కనిపించలేదు. దీంతో కంగుతిన్న గుర్తు తెలియని వ్యక్తి.. నేనిప్పుడే మీ నాన్నగారితో మాట్లాడుతానంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. ‘బీరువాలో తెగిపోయిన బంగారు గొలుసు ఉందని మీ నాన్నగారు చెప్పారు’ అంటూ మళ్లీ నమ్మబలికాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జైపాల్రెడ్డి చిన్న కుమారుడు జాన్రెడ్డి బీరువా పైభాగంలో నగలు ఉంటాయని చెప్పేశాడు. పిల్లలంతా కలిసి కుర్చీ ఎక్కి మరీ బీరువాలోని బంగారు గాజులు, నల్ల పూసల తాడు, రెండు జతల చెవి కమ్మలు, పిల్లల గొలుసులు, బ్రాస్లెట్ తీసి ఆ అపరిచితుడి చేతికి ఇచ్చేశారు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కాజీపేట పోలీసుస్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
Advertisement


