వరద కాదు.. నికర కేటాయింపులే కావాలి | not flood net allocation needs | Sakshi
Sakshi News home page

వరద కాదు.. నికర కేటాయింపులే కావాలి

Mar 7 2017 10:07 PM | Updated on Sep 5 2017 5:27 AM

వరద కాదు.. నికర కేటాయింపులే కావాలి

వరద కాదు.. నికర కేటాయింపులే కావాలి

కరువుతో అల్లాడుతున్న సీమకు కావాల్సింది వరద జలాలు కాదని, నికర కేటాయింపులే చేయాలని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

- సీమను సస్యశ్యామలం చేస్తామంటునే
  సర్వనాశం చేస్తున్నారు
- వివక్షపై నోరు విప్పేనాథులే కరువయ్యారు
- రాయలసీమ ప్రజా, విద్యార్థి, కుల
   సంఘాల సమావేశంలో బైరెడ్డి
 
కర్నూలు సిటీ: కరువుతో అల్లాడుతున్న సీమకు కావాల్సింది వరద జలాలు కాదని, నికర కేటాయింపులే చేయాలని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.  పాత బస్టాండ్‌ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాయలసీమ ప్రజా, విద్యార్థి, కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా  సీఎం చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులంతా పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని ప్రకటనలు చేశారు. మరి ఎక్కడ సస్యశ్యామలం చేశారో వారే చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టు పనులను ఏళ్లుగా సాగదీస్తూనే ఉన్నారు. రాయలసీమ గురించి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. కరువుతో గుక్కెడు తాగు నీరు చిక్కని పరిస్థితి ఉన్నా స్పందించడం లేదు.
 
మొదట పట్టిసీమ,  ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంతో కరువు సీమలో సీరులు పండిస్తామని చెప్పి, పంటలు సాగు చేశాక నీరివ్వకుండా సర్వనాశనం చేశారు. రాజధాని సీఆర్‌డీఏలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో ఒక్కటి కూడా రాయలసీమ వాసులకు ఇవ్వలేదు. ప్రశ్నిస్తే  నాన్‌లోకల్‌ అని దరఖాస్తూలు తీసుకోకపోయినా సీమ నిరుద్యోగులు నోరు విప్పే స్థితిలో లేరు.  అభివృద్ధిలో అన్ని ప్రాంతాలను సమంగా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం మరించింది’ అని బైరెడ్డి ఆరోపించారు.
 
కనీసం ఇప్పటీకైనా రాయలసీమలోని యువత మేల్కోని ఓటుతో బుద్ధి చెప్పాలని, రాయలసీమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వాలని బైరెడ్డి పిలుపునిచ్చారు.  దళిత సంఘాల నాయకులు బాల సుందరం, ఆర్పీఎస్‌ కేంద్ర కమిటీ సభ్యులు త్యాగరాజు, విద్యార్థి సంఘం, రాయలసీమ ఉద్యమ నాయకులు శ్రీరాములు, రాయలసీమ నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement