బిల్లులకు డబ్బుల్లేవు..! | No money for bills | Sakshi
Sakshi News home page

బిల్లులకు డబ్బుల్లేవు..!

Nov 28 2015 1:52 AM | Updated on Nov 9 2018 5:52 PM

రాష్ట్ర ప్రభుత్వం అప్పు ద్వారా సమీకరించిన నిధులను ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర ఆర్భాటాల కోసం ఎక్కువగా వెచ్చించడంతో కేంద్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అప్పు ద్వారా సమీకరించిన నిధులను ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర ఆర్భాటాల కోసం ఎక్కువగా వెచ్చించడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోరినంత మేర అప్పునకు కూడా అనుమతించకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం కేంద్రం అనుమతిస్తేగానీ పైసా అప్పు చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో అన్నిరకాల బిల్లుల చెల్లింపును రాష్ట్ర ఆర్థిక శాఖ నిలిపివేసింది. ఈ నెలలో ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీ నిధులను కూడా నిలిపివేసింది. అత్యవసర వేతనాల బిల్లులను మాత్రమే చెల్లించాల్సిందిగా ఖజానా కార్యాలయాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 10వ తేదీ వరకు కేవలం జీతాలను మాత్రమే చెల్లించనున్నారు.

10వ తేదీ తరువాత ప్రాధాన్యతలకు అనుగుణంగా చెల్లింపునకు అనుమతించాలని నిర్ణయించారు.రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం,  కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు వస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఎక్కువగా చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోందని అధికారుల కథనం. ఈ ఉద్దేశంతోనే కేంద్రం కూడా అప్పునకు వెంటనే అనుమతించడం లేదని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  రాష్ట్రం ఇప్పటివరకు రూ.9,050 కోట్ల అప్పు చేసింది. తాజాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల్లో అంటే మార్చి వరకు రూ.6 వేల కోట్లు సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పు చేసేందుకు అనుమతించాల్సిందిగా శుక్రవారం కేంద్రానికి లేఖ రాసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement