కొత్త ఐడియా గురూ! | new idea boss | Sakshi
Sakshi News home page

కొత్త ఐడియా గురూ!

Aug 28 2017 10:05 PM | Updated on Sep 17 2017 6:03 PM

పందులు సంచరించే బాటనందు వెంట్రుకలు పడవేస్తున్న రైతు

పందులు సంచరించే బాటనందు వెంట్రుకలు పడవేస్తున్న రైతు

పందుల దాడుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

- వెంట్రుకలతో పందుల బెడద నివారణ
- మంగలి షాపుల నుంచి వెంట్రుకలు సేకరణ
- రుద్రవరం మండల రైతుల కొత్త ఐడియా
 
రుద్రవరం: పందుల దాడుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు పొలం చుట్టూ తంతె(ఇనుప తీగ) చుడుతుండగా మరికొందరు చీరలు చుట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రానురాను పందులు వీటికి అలవాటు పడుతుండడంతో రైతులు కొత్త ఐడియాతో ముందుకెళ్లక తప్పడం లేదు. ఏటా ఒక కొత్త ప్రయోగం ఆచరిస్తుండగా మరుసటి ఏడాది వాటిని పందులు పసిగడుతుండడంతో ఫలితం లేకుండా పోతోంది. అటవీ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మరోవైపు వాటిని చంపితే కేసులు నమోదు చేస్తున్నారు.
 
దీంతో నల్లమల అటవీ సమీపాన ఉన్న రుద్రవరం, మరో 11 గ్రామాల రైతులు ఈ ఏడాది వినూత్నంగా ఆలోచించారు. మంగలి షాప్‌లో కటింగ్‌ చేసిన తర్వాత వచ్చే వెంట్రుకలను తెచ్చి పందులు సంచరించే ప్రాంతాలు, దారుల్లో వెదజల్లుతున్నారు. పంటలపై దాడులు చేస్తే పందులు నిత్యం భూమిని వాసన చూస్తూ వెళ్తుంటాయి. ఆ సమయంలో వాటి ముక్కు రంధ్రాల్లోకి వెంట్రుకలు వెళ్లి శ్వాసకు ఆటంకం కల్గిస్తాయని రైతులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే పందులు పంటలపై దాడులు చేయలేవని, ఇలా పంటలను కాపాడుకుంటున్నామని పేర్కొంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement