ప్రలోభాలతోనే నంద్యాలలో గెలుపు | nandyal won with temptations | Sakshi
Sakshi News home page

ప్రలోభాలతోనే నంద్యాలలో గెలుపు

Aug 30 2017 10:55 PM | Updated on Sep 17 2017 6:09 PM

ప్రలోభాలతోనే నంద్యాలలో గెలుపు

ప్రలోభాలతోనే నంద్యాలలో గెలుపు

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభాలు గురిచేయడం, మభ్య పెట్టడంతోనే భూమా బ్రహ్మానందారెడ్డి విజయం సాధించారని వైఎస్‌ఆర్‌సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు.

– టీడీపీ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా పంపిణీ చేసింది
– సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని బెదిరించారు
– వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు
– దమ్ముంటే ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
– వైఎస్‌ఆర్‌సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభాలు గురిచేయడం, మభ్య పెట్టడంతోనే భూమా బ్రహ్మానందారెడ్డి విజయం సాధించారని వైఎస్‌ఆర్‌సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడేళ్ల తన పాలనలో మూడున్నర లక్షల అవినీతికి పాల్పడ్డారని, అందులో రూ.200 కోట్లను నంద్యాలలో విచ్చలవిడిగా పంపిణీ చేశారన్నారు. ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇవ్వడంతోపాటు రోజుకు ఒక్కో వార్డులో ఐదు లక్షలు, ఒక్కో గ్రామంలో పది లక్షల రూపాయలను తిని తాగడం కోసం వెచ్చించారన్నారు. అయినప్పటికీ ప్రజలెవరూ టీడీపీ వైపు వెళ్లకపోవడంతో స్వయనా సీఎం చంద్రబాబునాయుడుతో సహా క్యాబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బెదిరింపులకు దిగారన్నారు.
 
సర్వే పేరుతో బృందాలను దింపి నేరుగా ఓటర్లను తెలుగుదేశానికి ఓటు వేయాలని, లేదంటే రేషన్‌కార్డులు, పింఛన్లు, చంద్రన్నబీమా, లోన్లు రద్దు చేస్తామని భయపెట్టారన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో నంద్యాల ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాల్సి వచ్చిందన్నారు. బుధవారం బిర్లా కంపౌండ్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి మధుసూధన్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు   దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడినా తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు. 70 వేల మంది ఓటర్ల విశ్వాసాన్ని పొందామన్నారు.  
 
దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
నంద్యాల గెలుపును టీడీపీ నాయకులు బలుపు అనుకుంటున్నారని, అది ఎప్పటికీ వాపేనని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. అంత దమ్ముంటే ఫిరాయించిన మిగతా 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. నంద్యాలలో ఓటర్లను భయ పెట్టడంతోనే టీడీపీ గెలిచిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగే ఉంటే తమ పార్టీ తప్పక గెలిచేదన్నారు. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సమరోత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement