
బీజేపీ నేతలపై మంత్రి తిట్లపురాణం
తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతల మధ్య తిట్లపురాణం మరింత వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ వైఖరిపై బీజేపీ నేతలు మండిపడుతుండగా.. వారిపై సైకిల్ పార్టీ నేతలు దూషణలకు దిగుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతల మధ్య తిట్లపురాణం మరింత వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ వైఖరిపై బీజేపీ నేతలు మండిపడుతుండగా.. వారిపై సైకిల్ పార్టీ నేతలు దూషణలకు దిగుతున్నారు. టీడీపీ వైఖరిని తప్పుబట్టిన బీజేపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి రావెల కిషోర్బాబు మండిపడ్డారు. కన్నా తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారని, ఆయన ఎలా వందలకోట్లు సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ మీడియా పాయింట్లో గురువారం మంత్రి రావెల విలేకరులతో మాట్లాడుతూ టీడీపీని, సీఎం చంద్రబాబునాయుడిని విమర్శించిన బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైనా విమర్శల దాడికి దిగారు. గురివిందకు తన నలుపు తెలియదని వారిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వారు చేసిన విమర్శలను వారి వ్యక్తిగత విమర్శలుగానే చూస్తామని, బీజేపీ చేసిన విమర్శలుగా భావించబోమని ఆయన పేర్కొన్నారు. ఓ సైకిల్ దుకాణానికి యజమాని కొడుకు ఇప్పడు వందల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు కూడా రెండు ఎకరాల నుంచి కోట్లాది ఆస్తులను కూడబెట్టారు కాదా? అని ఓ విలేకరి ప్రశ్నిస్తే చంద్రబాబు తన ఆస్తులకు లెక్కలు చూపిస్తున్నారని, కన్నా కూడా తన ఆస్తుల వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో టీడీపీ సింగపూర్ తరహా పాలన కొనసాగుతుందని మంత్రి చెప్పారు.