
ఎంసెట్-2 రద్దుపై ఆందోళన వద్దు : కడియం
ఎంసెట్-2 రద్దు విషయంలో సీఐడీ నివేదిక పరిశీలించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కడియం శ్రీహరి అన్నారు.
సీఐడీ నివేదిక తర్వాతే నిర్ణయం
వరంగల్: ఎంసెట్-2 రద్దు విషయంలో సీఐడీ నివేదిక పరిశీలించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనను కలిశారు. ఎంసెట్-2 రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోందని, విద్యార్థులు ఇప్పటికే కష్టపడి చదివి రెండు ఎంసెట్లు రాశారని వివరించారు. మరోసారి ఎంసెట్ నిర్వహిస్తే తమ పిల్లలు రాసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని, కావాలంటే వారి ప్రవేశాలు రద్దు చేయాలని, తమను ఇందులో బలిచేయొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు కడియం ముందు గోడు వెళ్లబోసుకున్నారు. మరోసారి ఎంసెట్ నిర్వహించవద్దని కోరారు. గతంలో అక్రమాలకు పాల్పడినవారిపై చర్య తీసుకుంటే ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదన్నారు. విద్యార్థులకు నష్టం కలగద ని, ఆందోళన చెందవద్దని కడియం వారికి చెప్పారు.