కృష్ణా పుష్కరాల సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశారు. కలెక్టర్ బాబు.ఎ బుధవారం ఇరిగేషన్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశమై పుష్కరాల విధులకు సంబంధించిన ప్రణాళికపై కసరత్తు చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా సీఎం సమక్షంలో ఈ నెల 6వ తేదీన ఏ–కన్వెన్షన్ సెంటర్లో సమావేశం నిర్వహిస్తారు.
పుష్కరాలకు కార్యాచరణ సిద్ధం
Aug 3 2016 11:43 PM | Updated on Sep 4 2017 7:40 AM
విజయవాడ :
కృష్ణా పుష్కరాల సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశారు. కలెక్టర్ బాబు.ఎ బుధవారం ఇరిగేషన్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశమై పుష్కరాల విధులకు సంబంధించిన ప్రణాళికపై కసరత్తు చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా సీఎం సమక్షంలో ఈ నెల 6వ తేదీన ఏ–కన్వెన్షన్ సెంటర్లో సమావేశం నిర్వహిస్తారు. సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందు కు శిక్షణ ఇస్తారు. పుష్కర విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు బస చేసే ప్రాంతంలోనే ఆహారం తదితర ఏర్పాట్లు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 1,095 విడిది ప్రాంతాలను గుర్తించారు. సిబ్బందికి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు మూడు షిఫ్టులుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పుష్కరాల్లో సదస్సులు : కలెక్టర్
పుష్కరాల సందర్భంగా పలు అంశాలపై సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జల సంరక్షణ, అమరావతి, వనం–మనం, వ్యవసాయం, విద్య, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం తదితర అంశాలపై సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పుష్కరనగర్లు, ఘాట్లు, పుష్కర విడిది కేంద్రాల సమీపంలో, రహదారులపై మద్యం విక్రయాలపై నిషేధ ఆజ్ఞలు అమల్లోకి వస్తాయన్నారు. ‘స్వచ్ఛపుష్కరాలు’ అనే విధానంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో పారిశుద్ధ్య, మున్సిపల్, పంచాయతీ అధికారులు, సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను అతిథులుగా ఆదరించాలని, వసతి, భోజన , సదుపాయాలపై వ్యక్తిగత పర్యవేక్షణ అవసరమన్నారు. అధికారులు, సిబ్బందిని సమన్వం చేసుకుంటూ యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు 400 వైర్లెస్ సెట్లను ముఖ్య అధికారులకు అందిస్తామని తెలిపారు. ఘాట్ల వద్ద 30 లైఫ్బోట్ సర్వీసులు అందుబాటులో ఉంచుతామన్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆధార్ ఆధారంగా ఐడీ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో రైల్వే డీజీఎం అశోక్కుమార్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ డాక్టర్ జి.సృ జన, ఎన్డీఆర్ఎఫ్ డెప్యూటీ కమాండెంట్ మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement