ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1) రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసిందంటూ కాంగ్రెస్కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ లేఖ రాశారు. అంతేకాదు యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని పేర్కొన్నారు.
అయితే దీనికి స్పందనగా ఇరాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని, తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది.
ఖతం అల్-అన్బియాసెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్దార్ మహమ్మద్ జాఫర్ అసాదీ శనివారం మాట్లాడుతూ, వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని విమర్శించారు. కేవలం చమురు ధరలు తగ్గకుండా చూడటానికి ,వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే వారు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
భారీ నష్టం
సిఎన్ఎన్ (CNN) పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా స్థావరాలలో ఒకటైన ఇక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనిలోని ప్రధాన భాగాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.
ఇదీ చదవండి: నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకం
ఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమ ఆసియాలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయని, కొన్ని చోట్ల సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
మరోవైపు, అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.పారిశ్రామిక మార్గాల్లో అమెరికా కఠిన చర్యల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసినట్లు యాక్సియోస్ (Axios) నివేదించింది. కాగా అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందమేదీ ఇంతవరకూ కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది.
మరోవైపు మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపిన ఒక అధికారిక ప్రతిపాదనలో కొత్త కాలపరిమితిని స్పష్టంగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇజ్రాయెల్ మరియు అమెరికా మళ్లీ దాడి చేయవన్న హామీతో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ జలసంధిని తెరుస్తుంది ,అమెరికా ఇరాన్పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది.


