ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం | lovers suscide attempt | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Nov 17 2016 9:46 PM | Updated on Sep 4 2017 8:22 PM

బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని అగ్రహారంలో ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ప్రియురాలు ఝాన్సీసుమతి (21) మృతి చెందింది. ప్రియుడు పందీటిబాలుడు కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

గోపవరం (బద్వేలు):  బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని అగ్రహారంలో ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో ప్రియురాలు ఝాన్సీసుమతి (21) మృతి చెందింది. ప్రియుడు పందీటిబాలుడు కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అగ్రహారానికి చెందిన పిచ్చయ్య, కేశమ్మ దంపతుల మూడవ కుమార్తె ఝాన్సీసుమతి ఇంటర్మీడియట్‌ వరకు చదివి ఇంటి వద్ద ఉంది. అదే గ్రామానికి చెందిన పందీటిబాలుడుతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. అయితే తమ పెద్దలు కులాంతర వివాహానికి అడ్డుపడతారేమోనని వారు విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపలేదు. ఇంతలో ప్రియుడు బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లి గత నెలలో స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రియుడు బాలుడుకు అట్లూరు మండలంలో వివాహ నిశితార్థం జరిగింది. డిసెంబర్‌ 3, 4 తేదీల్లో వివాహం జరగనుంది. ఈ క్రమంలో ఈ ప్రేమికుల మధ్య ఏం జరిగిందో  బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రియుడు, ప్రియురాలు గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బద్వేలు పట్టణంలోని గుంతపల్లె క్రాస్‌రోడ్డు వద్ద విష ద్రావణం తాగారు. ఈ విషయాన్ని బాలుడు తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే వీరిద్దరిని బద్వేలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అయితే తమ కుమార్తె ఎక్కడికి వెళ్లిందోనని ఆమె తల్లిదండ్రులు గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో బుధవారం అర్ధరాత్రి 130 గంటల సమయంలో మీ అమ్మాయి చనిపోయిందని తల్లిదండ్రులకు తెలిపారు. ప్రియుడు బాలుడిని మాత్రం బంధువులు కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని తెలిసింది. తమ కుమార్తెను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఇంటి నుంచి తీసుకెళ్లి ఆతహత్యాయత్నానికి ఉసిగొలిపి చంపారని మృతదేహంతో అమ్మాయి తల్లిదండ్రులు ప్రియుడి ఇంటి ముందు  ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ రామాంజినాయక్‌ అగ్రహారానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వారి బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement