రైతులకు సకాలంలో అందిస్తాం | loans will issue on right time | Sakshi
Sakshi News home page

రైతులకు సకాలంలో అందిస్తాం

Apr 16 2017 1:36 PM | Updated on Jun 4 2019 5:04 PM

రైతులకు సకాలంలో అందిస్తాం - Sakshi

రైతులకు సకాలంలో అందిస్తాం

ఈ ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు రైతులకు భారీగానే ఇవ్వాలని బ్యాంకర్లు సంకల్పించారు.

► పంట రుణం రూ.3939.58 కోట్లు
► ఖరీఫ్‌ సీజన్‌కు రూ. 2954.28 కోట్లు
► రబీ సీజన్‌కు రూ.985.30 కోట్లు
► లీడ్‌ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ లేవాకు రఘునాథరెడ్డి వెల్లడి


కడప అగ్రికల్చర్‌: ఈ ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు రైతులకు భారీగానే ఇవ్వాలని బ్యాంకర్లు సంకల్పించారు. సీజన్‌ ప్రారంభానికి ముందే రుణాలు అందించడానికి ప్రణాళికలు తయారు చేశాం.. అని జిల్లా లీడ్‌బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ లేవాకు రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం కడప నగరం ఏడురోడ్ల కూడలిలోని బ్యాంకు కార్యాలయంలో ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ ఏడాది పంట రుణాలు మొత్తం రూ.3939.58 కోట్లుగా ఖరారు చేశామన్నారు. ఇందులో ఖరీఫ్‌ సీజన్‌కు రూ. 3939.58 కోట్లు, రబీ సీజన్‌కు రూ.985.30 కోట్లు ఇవ్వాలని ప్రణాళికలు తయారు చేశామన్నారు.

అలాగే వ్యవసాయంలో దీర్ఘకాలిక రుణాలు రూ.321.75 కోట్లు, వ్యవసాయ గోడౌన్ల నిర్మాణాలకు, ఇతర అభివృద్ధి పనులకుగాను రూ.144.68 కోట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణాలకు, బిజినెస్‌ సెంటర్లకుగాను రూ.79.61 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.5085.63 కోట్లు ఖర్చు చేయాలని బ్యాంకులకు చెప్పామన్నారు. అప్రాధాన్యత రంగాలకు రూ. 853.57 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మే నెల 1 వ తేదీ నుంచి రుణాలను రైతులకు ఇవ్వాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ఏడాది అన్ని రకాల పంట రుణాలు కలిపి రూ.5900 కోట్లకుగాను, రూ.5483 కోట్ల రుణాలు అందించారని అన్నారు.

ఈ ఏడాది ముందుగా కొత్త రుణాలు రెన్యూవల్‌ చేయాలని బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చారన్నారు. రైతులు పంట సాగు సమయంలో కాకుండా రుణాలు ఇచ్చే మొదటి నుంచే రెన్యూవల్‌ చేసుకోవడం, కొత్త రుణాలు తెచ్చుకుంటే బ్యాంకర్లకు ఒత్తిడి తగ్గుతుందన్నారు. అలాగే రైతులకు కూడా ఒక వైపు వర్షాలు పడుతుంటే, మరోవైపు ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవడం, ఇంకో వైపు రుణాల కోసం వెంపర్లాడడం కంటే ముందుగానే రుణాలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement