భద్రతకు భరోసా


నిఘా నీడలో కస్తూర్బాలు

► జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి

► జిల్లాలో 11 కస్తూర్బా విద్యాలయాలు

► త్వరలో హైదరా బాద్‌లోని కంట్రోల్‌రూంకు లింకు




హుజూరాబాద్‌: కస్తూర్బా విద్యాలయాల్లో భద్రతతోపాటు విద్యాప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. జిల్లాలోని ఎక్కువ సంఖ్యలో విద్యాలయాలు శివారు ప్రాంతాల్లో ఉండడంతో ఆకతాయిల చేష్టలతోపాటు పాములు, పురుగుల భయం ఉండేది. దీనికి తోడు అధికా రుల అక్రమాలు సరేసరి. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకే సీసీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకా రం చుట్టింది. జిల్లాలోని మొత్తం 11 కస్తూర్బాలు ఉండగా.. కొన్ని మండ ల కేంద్రాలకు సమీపంలో, మరికొ న్ని గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో  ఉన్నాయి. విద్యార్థినుల భద్రతపై భరోసానిస్తూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసింది.



హుజూరాబాద్‌: 11 కస్తూర్బా విద్యాలయాల్లో 1,760 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల బాలికలకు భద్రత మరింత పెంచేందుకు ప్రతీ పాఠశాలలో ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక కెమెరా డైనింగ్‌ సెక్షన్‌లో, ఒకటి స్టోర్‌రూం, మూడోది వరండాలో, మరోటి పాఠశాల ముందు బిగించారు. దీంతో పాఠశాలలోకి ఎవరు ప్రవేశించినా ముందు కెమెరాలో రికార్డు అయ్యేలా ఏర్పాట్లు చేశారు.



నాణ్యతాప్రమాణాల పెంపే లక్ష్యం..

సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రతతోపాటు నాణ్యతాప్రమాణాలు కూడా పెరగనున్నాయి. ప్రధానంగా డైనింగ్‌ సెక్షన్‌లో ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చు. పాఠశాల ఎదుట బిగించిన సీసీ కెమెరాతోనూ భద్రత పెరుగుతుంది.



తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య..

కస్తూర్బాలో అన్ని వసతులు కల్పిస్తున్నా క్రమంగా విద్యార్థినుల సంఖ్య తగ్గుతోంది. పాఠశాలలో కనీస వసతులు కరువవడంతో విద్యార్థినులు వెనుకడుగు వేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యాప్రమాణాలను గాలికి వదిలేశారనే విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.



హైదరాబాద్‌కు లింకు..

కస్తూర్బా పాఠశాలలో ఏ మూలన ఏం జరుగుతోందనే విషయాన్ని ప్రిన్సిపాల్‌ తన గది నుంచే చూసుకునే వీలుంది. ఇందుకు ప్రిన్సిపాల్‌ గదిలో మానిటర్‌ ఏర్పాటు చేశారు. త్వరలోనే ప్రతీ పాఠశాల నుంచి హైదరాబాద్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పాఠశాలలో ఏం జరుగుతోందనే విషయాన్ని రాజధానిలోని ఉన్నతాధికారులు క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. అదేవిధంగా ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.



భద్రత ఉంటుంది..

మా పాఠశాల పట్టణానికి దూరంగా ఉండడంతో గతంలో భయంగా ఉండేది. ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత కల్పించినట్లుగా ఉంటుంది. బాలికలకు భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతీది రికార్డు అవుతుందనే ఆలోచనతో నేరం చేయడానికి కూడా భయపడతారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో సత్ఫలితం ఇచ్చింది.   – సుప్రియ, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్, జమ్మికుంట 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top