సమరం వేళ షాక్..
కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీకి గట్టిషాక్ తగిలింది. ఆ పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కార్పొరేటర్ కొలగాని దుర్గాప్రసాద్ ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
-కార్పొరేషన్ ఎన్నికల ముందు టీడీపీకి కుదుపు
-అధికార పార్టీని వీడిన మాజీ వైస్ చైర్మన్ ఇనుకొండ, మాజీ కార్పొరేటర్ కొలగాని
-రాష్ట్రనేతల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిక
కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీకి గట్టిషాక్ తగిలింది. ఆ పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కార్పొరేటర్ కొలగాని దుర్గాప్రసాద్ ఆదివారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గతంలో ప్రజాప్రతినిధులుగా సేవలందించిన వీరిద్దరూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో టీడీపీని వీడడంతో ఆ పార్టీ నేతలకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది. వీరితోపాటు మరికొందరు నేతలు కూడా వైఎస్సార్ సీపీలో చేరనున్న సంకేతాలు టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. ఆ పార్టీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరగడంతో పాటు వైఎస్సార్ సీపీ నానాటికీ ప్రజలకు చేరువవుతోందనడానికి వీరి చేరికలు మరింత బలాన్నిచ్చాయి. సోమవారం నుంచి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో.. ఇనుకొండ, కొలగానిల చేరిక వైఎస్సార్సీపీలో శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్నినింపింది. ఇది పార్టీకి మంచి పరిణామమని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వారి చేరిక.. కదనంలో అదనపు బలం
ప్రజలతో సత్సంబంధాలు కలిగి, ప్రజాసమస్యల పరిష్కారానికి గతంలో ఎంతో కృషి చేసిన ఇనుకొండ, కొలగానిల చేరికతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరగలదని ఆ పార్టీ రాష్ట్రనేతలు అన్నా రు. పార్టీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కార్పొరేటర్ కొలగాని దుర్గాప్రసాద్లకు రాష్ట్రనేతలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే ధ్యేయంగా కష్టపడి పనిచేయాలని కోరారు. ద్వారంపూడి మాట్లాడుతూ ఒకప్పుడు తనకు మంచి స్నేహితులైన పట్టాభిరామయ్య, దుర్గాప్రసాద్ ఫ్రెండ్షిప్ డేన పార్టీలో చేరడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. వీరివల్ల పార్టీకి అదనపు బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్వీజేఆర్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఐ.శ్రీను, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొబ్బిలి గోవిందు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్పొరేటర్లుగా విశిష్ట సేవలు
వైఎస్సార్ సీపీలో చేరిన పట్టాభిరామయ్య గతంలో ఎన్నో సేవలు అందించారు. ప్రభాజోషఫ్, బీరక చంద్రశేఖర్ మున్సిపల్ చైర్మన్లుగా ఉన్న సమయంలో కౌన్సిలర్గా పనిచేశారు. ఆ తరువాత మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా సేవలందించారు. దుర్గాప్రసాద్ 2005లో కార్పొరేటర్గా ఎన్నికై స్టాండింగ్ కమిటీ, శానిటేషన్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు.