కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ | kakinada corporation elections | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

Aug 5 2017 11:17 PM | Updated on Aug 14 2018 5:56 PM

కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ - Sakshi

కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

కాకినాడ: రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఎలక‌్షన్‌ కమిషన్‌ పచ్చ జెండా ఊపింది. కోర్టు తీర్పు నేపథ్యలో రెండు డివిజన్లను మినహాయించి 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా శనివారం రాత్రి ఎన్నికల సంఘం ఆదేశా

- 48 డివిజన్లకు ఎలక‌్షన్‌ కమిషన్‌ ఆమోదం
- ఇక యథావిధిగా ఎన్నికల ప్రక్రియ
- 7 నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం
లు జారీ చేసింది. దీంతో గడచిన రెండు రోజులుగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు అనుగుణంగా అవసరమైన సన్నాహాల్లో కార్పొరేషన్‌ అధికారులు నిమగ్నమయ్యారు. 
జీవో 83 సస్పెన్షన్‌...
  ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో మూడు పంచాయతీల విలీనానికి సంబంధించిన జీవోను సస్పెండ్‌ చేస్తూ కోర్టు ఉత్తర్వులివ్వడంతో ఎన్నికల కొనసాగింపుపై రెండు రోజులుగా సందిగ్ధానికి దారితీసింది. ఆ పంచాయతీలున్న డివిజన్లు వదిలేసి మిగతా 48 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించుకోవాలని స్పష్టం చేయడంతో అధికారులు సన్నద్ధం కాక తప్పలేదు. దీంతో కాకినాడలోని 42, 48 డివిజన్లలో ఎన్నికలు నిలుపుదల చేశారు. 
ఎన్నికల సంఘానికి లేఖ...
కోర్టు ఆదేశాల నేపథ్యంలో గంగనాపల్లి, స్వామినగర్, ఎస్‌.అచ్యుతాపురం పంచాయతీలకు సంబంధించిన 42,48 డివిజన్లను పక్కన పెట్టి మిగిలిన డివిజన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు నగరపాలక సంస్థ సమాయత్తమైంది. ఈ మేరకు వివాదంలో రెండు డివిజన్లను మినహాయించి మిగిలిన 48 డివిజన్లలో ఎలక‌్షన్‌ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ నెల 7వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కమిషనర్‌ ఆలీమ్‌ బాషా శనివారం సాయంత్రం లేఖ పంపించారు.
స్పష్టత ఇచ్చిన ఈసీ 
కమిషనర్‌ పంపిన లేఖతో ఎన్నికల సంఘం శనివారం రాత్రి ఎన్నికల నిర్వహణపై కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆ రెండూ మినహాయించి మిగిలిన 48 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించి శనివారం రాత్రి 8 గంటల సమయంలో కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
ఏర్పాట్లలో అధికారులు...
ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావడంతో ఈ నెల 7వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ దిశగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించి ప్రతి మూడు డివిజన్లకు ఒక్కో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నియమించిన రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.
ఆర్వోలతో సమావేశం...
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులతో కమిషనర్‌ ఆలీమ్‌ బాషా శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. 48 డివిజన్ల ఎన్నికలకు  సంబంధించి ఆర్వోలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక్కో కార్యాలయాన్ని, ఆర్వోను నియమించినందున నామినేషన్ల స్వీకరణకు ఆయా డివిజన్‌ కేంద్రాల్లో సోమవారం సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement