యనమల శిబిరానికి జ్యోతుల వర్గం చెక్‌.. | jyotula nehru Vs yanamala ramakrishnudu over annavaram EO posting issue | Sakshi
Sakshi News home page

యనమల శిబిరానికి జ్యోతుల వర్గం చెక్‌..

Aug 3 2017 10:12 AM | Updated on Aug 27 2018 8:44 PM

యనమల శిబిరానికి జ్యోతుల వర్గం చెక్‌.. - Sakshi

యనమల శిబిరానికి జ్యోతుల వర్గం చెక్‌..

టీడీపీలో ఫిరాయింపుదారులే పవర్‌ఫుల్‌ అవుతున్నారు. వారి ముందు సీనియర్లైన మంత్రుల సైతం దిగదుడుపుగానే మిగిలిపోతున్నారు.

- జెడ్పీ షాక్‌ నుంచి తేరుకోక ముందే మరో దెబ్బ
– మంత్రి యనమల శిబిరానికి జ్యోతుల వర్గం చెక్‌ 
– అన్నవరం ఈఓ విషయంలో పంతం నెగ్గించుకుంటున్న ఫిరాయింపు నేతలు 
– రఘునాథ్‌పై ఆరోపణల కేసు తిరగదోడుతూ అడ్డగింత
– వలసల పెత్తనేమేమిటంటూ టీడీపీలో విస్తృత చర్చ 
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీలో ఫిరాయింపుదారులే పవర్‌ఫుల్‌ అవుతున్నారు. వారి ముందు సీనియర్లైన మంత్రుల సైతం దిగదుడుపుగానే మిగిలిపోతున్నారు. పార్టీ అధిష్టానం జంప్‌ జిలానీలకే పెద్దపీట వేస్తోంది. వారికోసం సీనియర్లను పక్కన పెట్టి  దాసోహమైపోతోంది. ఇప్పుడా పార్టీకి బలం, బలహీనత ఫిరాయింపుదారులేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు కోసం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీలో ఎవరి హవా సాగుతుందో....ఎవరి మాట చెల్లుబాటు కావడం లేదో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి యనమల శిబిరానికి వరుసగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.  
 
సత్యదేవుని ఆలయ కార్యనిర్వహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా బదిలీ అయ్యాక వారి స్థానంలో కొత్తగా ఎవర్నీ నియమించలేదు. ఈ పోస్టు కోసం టీడీపీలో రెండు గ్రూపులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. చెరో ఒకర్ని ప్రతిపాదించడంతో అన్నవరం కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. ఈ పోస్టును  కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈఓ మంచెనపల్లి రఘునాథ్‌, ద్వారకా తిరుమల ఈఓ వేండ్ర త్రినాథరావు ప్రధానంగా ఆశిస్తున్నారు.
 
వీరికి ఒక్కో వర్గం అండగా నిలిచింది. పోస్టింగ్‌ కోసం లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఏసీబీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నవరం దేవస్థానం పూర్వపు ఈఓ, ప్రస్తుత పెనుగంచి ప్రోలు ఈఓ రఘునా«థ్‌ను తీసుకొచ్చేందుకు మంత్రి యనమల వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ద్వారకా తిరుమల దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వేండ్ర త్రినాథరావును తీసుకురావడానికి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరపుల సుబ్బారావు శిబిరం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
 
రేసులో ఉన్న వారికి  ఇప్పటికే ఇరువర్గాలు తమ సిఫార్సు లేఖ కూడా ఇచ్చినట్టు తెలిసింది. మంత్రి యనమల అండదండలతో రఘునాథ్‌ త్వరలోనే ఈఓగా వచ్చేస్తున్నారని ఇప్పటికే విస్తృత ప్రచారం జరిగింది. దాదాపు పెండింగ్‌ ఫైళ్లన్నీ పరిష్కారం చేయించుకుని తనకు అనుకూలంగా లైన్‌ క్లియర్‌ చేసుకున్నారన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల శిబిరానికి చెందిన కొందరు రఘునా«థ్‌ను ఎలా నియమిస్తారో చూస్తామని...ముందు ఆయనపై ఉన్న ఆరోపణల కేసును ఎలా ఎదుర్కోవాలో చూసుకోవడం మంచిదనే సంకేతాలు పంపించారన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలూ తమకు ఇష్టమైన వ్యక్తిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది.
 
తెరపైకి రఘనాథ్‌ ఆరోపణల కేసు...
అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు కోసం నువ్వానేనా అన్నట్టుగా జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో పూర్వపు ఈఓ రఘునాథ్‌ ఆరోపణల కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో భాగంగా విచారణకు కూడా ఆదేశించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో 2008 ఆగస్టు నెలలో అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేసిన కాలంలో రఘునాథ్‌పై ఏసీబీ దాడులు చేసింది. ఆ దాడుల అనంతరం రఘునా«థ్‌ను పెనుగంచి ప్రోలు దేవస్థానానికి బదిలీ చేశారు. అనంతరం ఆయనకు ఏసీబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టుగా ప్రచారం కూడా జరిగింది. దీంతో ఏసీబీ దాడులతో మసకబారిన తన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకునేందుకు కనీసం చివరి ఏడాదైనా (ఆయనకు ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంది) అన్నవరం దేవస్థానంలో ఈఓగా పనిచేసి తానేంటో నిరూపించుకునే లక్ష్యంతో మంత్రి యనమల సాయంతో తీవ్రంగా ప్రయత్నిండగానే అనూహ్యంగా ఆరోపణల కేసు తెరపైకి రావడం అధికార వర్గాల్లోనే కాదు టీడీపీలోనూ చర్చనీయాంశమమయింది.
 
రెండు మూడు రోజుల్లో రఘునాథ్‌కు పోస్టింగ్‌ వస్తుందనుకున్న సమయంలో విచారణకు ప్రభుత్వం ఆదేశాలివ్వడమంటే తెరవెనుక రాజకీయమేదో జరిగిందన్న అనుమానాలు రెకేత్తుతున్నాయి. ఏదో విధంగా రఘునాథ్‌ను ఈఓగా రాకుండా అడ్డుకోవడంతోపాటు మంత్రి యనమల శిబిరానికి జలక్‌ ఇచ్చినట్టుగా ప్రత్యర్థి శిబిరం వ్యూహాత్మకంగా పావులు కదిపిందని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రభుత్వ స్థాయిలో ఫిరాయింపు నేతలు తమకున్న పలుకుబడినంతా ఉపయోగించి యనమల శిబిరంపై పైచేయి సాధించినట్టయిందని...తద్వారా తమకు అనుకూలమైన వేండ్ర త్రినాథరావు ఈఓగా రావడానికి మార్గం సుగమం చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. జెడ్పీ చైర్మన్‌ విషయంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎవరెంత కాదన్నా...మంత్రి యనమల అండతో నామన రాంబాబు ససేమిరా అన్నా...అధిష్టానం స్థాయిలో ఫిరాయింపుదారులు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. బలవంతంగా నామనను రాజీనామా చేయించి ఆ సీట్లో ఫిరాయింపు నేత కూర్చొన్నారు. ఈ విషయంలో ఎంత హైడ్రామా నడిచినా చివరికి జంప్‌ జిలానీలదే పైచేయి అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement