అక్రమాలపై జేసీ విచారణ | Sakshi
Sakshi News home page

అక్రమాలపై జేసీ విచారణ

Published Wed, Nov 2 2016 11:27 PM

అక్రమాలపై జేసీ విచారణ - Sakshi

గోనెగండ్ల: మండల కేంద్రంలో మీసేవా నిర్వాహకుడు మునిస్వామి, వీబీకే రంగన్నలు పాల్పడిన అక్రమాలపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో విచారణ చేపట్టారు.బతికి వున్న వారి పేరుపై మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆమ్‌ఆద్మీ పథకం కింద బీమా సొమ్మును కాజేశారని, మీసేవా కేంద్రం, ఆధార్‌ కేంద్రాల్లో పలు అక్రమాలు పాల్పడటమే కాకుండా భూ అక్రమాలకు తావిచ్చారని మానవ హక్కుల కమిషన్‌కు బాధితులు ఫిర్యాదులు చేశారు. కమిషన్‌ ఆదేశాల మేరకు జేసీ గత నెల18వ తేదీన విచారణ జరపాల్సి ఉంది. అనివార్య కారణాలతో విచారణ వాయిదా పడింది. ఎట్టకేలకు బుధవారం జేసీ బహిరంగ విచారణ చేశారు. భూములు కోల్పోయిన రైతులను ఒక్కొక్కరిని  విచారించారు. ఈ సందర్భంగా జేసీ విలేకరులతో మాట్లాడుతూ.. మీసేవా నిర్వాహకులు, కావేరి గ్రామైక్య సంఘం సభ్యులు, వీబీకేలపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ విచారణ చేశామని, బాధితులు కొన్ని ఆధారాలు ఇచ్చారన్నారు. కొన్ని అక్రమాలున్నయని దీనిపై మరింత విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని జేసీ పేర్కొన్నారు. విచారణలో అక్రమాలు తేలితే మీసేవా కేంద్రాన్ని కూడా రద్దు చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో మీసేవా ఏఓ లక్ష్మిదేవి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement