జలీల్‌ఖాన్‌.. రాజీనామా చేయ్‌! | jaleelkhan's resignation demand | Sakshi
Sakshi News home page

జలీల్‌ఖాన్‌.. రాజీనామా చేయ్‌!

Aug 6 2016 12:17 AM | Updated on Oct 16 2018 6:01 PM

జలీల్‌ఖాన్‌.. రాజీనామా చేయ్‌! - Sakshi

జలీల్‌ఖాన్‌.. రాజీనామా చేయ్‌!

‘జలీల్‌ఖాన్‌ రాజీనామా చేయ్‌. అధికార పార్టీకి తొత్తుగా ఉంటూ మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్‌లు కూలుస్తున్నావు, జాతి జాతి అంటూ ముస్లింలను తాకట్టు పెడుతున్నావ’ని పశ్చిమ నియోజకవర్గ ముస్లింలు జలీల్‌ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ : ‘జలీల్‌ఖాన్‌ రాజీనామా చేయ్‌. అధికార పార్టీకి తొత్తుగా ఉంటూ మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్‌లు  కూలుస్తున్నావు, జాతి జాతి అంటూ ముస్లింలను తాకట్టు పెడుతున్నావ’ని  పశ్చిమ నియోజకవర్గ ముస్లింలు జలీల్‌ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తారాపేటలోని మసీదు, ఖబర్‌స్తాన్‌ కూల్చేం దుకు అధికారులు సమయుత్తమవుతున్న నేపథ్యంలో అక్కడి ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌ అనంతరం మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తారాపేట మసీదు ప్రాంగణం వద్ద సమావేశమయ్యారు.

ముస్లిం మత ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఆ సమయంలో జలీల్‌ఖాన్‌ అక్కడకు రాగానే ముస్లింలు ఒక్కసారిగా రావద్దంటూ నినాదాలు చేశారు. మత పెద్దలు వారిని సముదాయించి కూర్చోపెట్టారు. జలీల్‌ఖాన్‌ మాట్లాడుతూ తనకు పదవులు, పార్టీలు ముఖ్యం కాదని, మసీదుకు సంబంధించి ఒక్క ఇటుక తీసినా వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. దాంతో వారు ఒక్కసారిగా రాజీనామా చేసేయ్‌ అంటూ బిగ్గరగా అరిచారు. రామవరప్పాడు మసీదు కూల్చివేత అంశంలోనూ ముస్లింలను మభ్యపెట్టి ప్రభుత్వానికి అండగా నిలిచావని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ముస్లిం పెద్దలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తానంటూ నమ్మబలికారు. అయినా ముస్లింలు  ఎదురుతిరగడంతో జలీల్‌ఖాన్‌ బిత్తరపోయారు. సమదాయించటానికి ముస్లిం పెద్దలు కూడా ఇబ్బంది పడ్డారు. 

మసీద్‌ జోలికి వస్తే ఊరుకోం : ఆసిఫ్‌
తారాపేట మసీదు జోలికి వస్తే ఊరుకోమని వైఎస్సార్‌ సీపీ పశ్చిమ నియోయజకవర్గ ఇన్‌చార్జి షేక్‌ ఆసిఫ్‌ అన్నారు. మౌన ప్రదర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు బుద్ధిచెప్పాలన్నారు. తారాపేట మసీదు వద్ద రోడ్డు విస్తరణకు సంబంధించి రైల్వే స్థలంలో కూడా స్థలాన్ని తీసుకోవాలని.. ఆ దిశగా కేంద్ర మంత్రిని కలిసి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మత సంస్థలపై అన్యాయంగా వ్యవహరి స్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సభకు ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు హబిబుర్‌ రెహమాన్‌ అధ్యక్షత వహించగా అహలే సున్నతులే జమాతే ఫోరం కో–కన్వీనర్‌ అల్తాఫ్‌రాజా  మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement