ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి | Injection took its toll and the young man killed | Sakshi
Sakshi News home page

ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి

Oct 1 2016 4:10 AM | Updated on Sep 4 2017 3:39 PM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి శుక్రవారం యువకుడు మృతి చెందాడు.

ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి

 నిజామాబాద్ క్రైం:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి శుక్రవారం యువకుడు మృతి చెందాడు. నగరంలోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి హబీబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ వికార్, భాను బేగంలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు మేస్త్రీ పనిచేస్తూ మరొక చోట భార్య పిల్లలతో ఉంటుండగా, మహమ్మద్ వాసీల్(17) స్థానికంగా ఓ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తుంటాడు.

ఇతని తండ్రి వికార్ గతంలోనే మృతి చెందగా, తల్లి భానుబేగం చిన్నకొడుకు వాసీల్ వద్ద ఉంటోంది. వాసీల్‌కు జ్వరం రావటంతో గత సోమవారం హ బీబ్‌నగర్‌లో ఆర్‌ఎంపీ బషీర్‌బాబా వద్దకు తీసుకెళ్లారు. అతను  ఆర్‌ఎంపీ వాసీల్ నడుముకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అయితే, ఇంజెక్షన్లు ఇచ్చిన చోట పుండ్లు అయ్యాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఇన్‌ఫెక్షన్ అయ్యిందని చెప్పారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపగా గత గురువారం రాత్రి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న వాసీల్ సాయంత్రం ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు.

ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా.. వాసీల్‌కు చికిత్స చేసిన ఆర్‌ఎంపీపై బంధువులు, స్థానికులు దాడిచేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న ఆర్‌ఎంపీ పారిపోయాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement