నగరంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు శనివారం పర్యటిస్తున్నారు.
విజయవాడ : ప్రత్యేక హోదా అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడుకు కమ్యూనిస్టుల నుంచి నిరసన ఎదురవుతుంది. ప్రత్యేక హోదాను దూరం చేసిన వెంకయ్యనాయుడు గోబ్యాక్ అంటూ సీపీఐ, సీపీఎం నాయకులు నల్లజెండాలతో రామవరప్పాడు సెంటర్లో ఆందోళన నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన వెంకయ్యనాయుడు అక్కడి నుంచి ఆయన పాల్గొన్న ర్యాలీ రామవరప్పాడు వద్దకు చేరుకునే సరికి పోలీసులు అప్రమత్తమైయ్యారు.
వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో్ వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు వెంకయ్యకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హోదాను సాధించలేని వెంకయ్యనాయుడు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ... సభలలో పాల్గొనడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దూరమైందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.