వేరుశనగ పంటను కాపాడాలి | Sakshi
Sakshi News home page

వేరుశనగ పంటను కాపాడాలి

Published Tue, Aug 23 2016 1:28 AM

Groundnut crop to be protected

అనంతపురం అర్బన్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగపంట ఎండిపోకుండా రెయిన్‌గన్‌ల ద్వారా రక్షక నీటి తడులను అందించాలని వ్యవసాయశాఖ అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ లక్ష్మీకాంతం, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ధనుంజయరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఎంఐపీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 12,387 హెక్టాలర్లలో వెరుశనగర పంట బెట్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ఇప్పటి వరకు 6,446 హెక్టార్లలో రెయిన్‌ గన్‌ల ద్వరా రక్షక తడి అందించారని, కొన్ని చోట్ల ఎంపీఈఓలు, ఏఓలు సక్రమంగా స్పందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిర్లక్ష్యం వీడి చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఎక్కడైనా పంట ఎండితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. జీడిపల్లి రిజ్వాయర్‌లో 1.2 టీఎంసీల నీరుందని, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నీటిని, ఎక్కడైనా చెరువుల్లో ఉన్న నీటిని వినియోగించుకుని రెయిన్‌గన్‌ల ద్వారా పంటకు అందించాలని ఆదేశించారు.
 
ఐదుగురు ఎంపీడీఓలకు అవార్డులు
జిల్లాలో ఇప్పటి వరకు 52 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మార్చారని, అక్టోబరు 2 నాటికి 150 గ్రామాలను ఈ విధంగా తీర్చిదిద్దాలని అధికారులను జేసీ లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓలు, మునిసిపల్‌ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజాసాధికార సర్వేపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వందశాతం పూర్తయ్యేలా చేసిన పుట్టపర్తి, కొత్తచెరువు, సోమందేపల్లి, పెద్దపప్పూరు, పుట్టూరు ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లకు ఈ నెల 26న అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. తాడిపత్రిలోనూ వంద శాతం ఓడీఎస్‌ చేసినందున మునిసిపల్‌ కమిషనర్‌కి కూడా అవార్డు ప్రకటించామన్నారు.  

Advertisement
Advertisement