
జనవరి 31లోగా ‘గ్రేటర్’ ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు మరో 45 రోజుల గడువు పెంచుతూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
♦ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం
♦ డిసెంబర్ 15కల్లా ఎన్నికల ప్రక్రియ ముగించి..
♦ ఆ తరువాత 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఏజీ
♦ అఫిడవిట్ సమర్పించిన ‘గ్రేటర్’ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు మరో 45 రోజుల గడువు పెంచుతూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 31 నాటికి గ్రేటర్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతోపాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 70(జీ)ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం... ఈ ఏడాది డిసెంబర్ 15కల్లా ఎన్నికలను పూర్తి చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 27న ఈసీని ఆదేశించింది. ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ముందుండే ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో 45 రోజుల గడువు ఇవ్వాలని కోరుతూ ఎన్నికల అధికారి హోదాలో జీహెచ్ఎంసీ కమిషనర్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశంతో చేపట్టిన ఆధార్తో ఓటరు కార్డుల అనుసంధానాన్ని సుప్రీంకోర్టు ఆధార్పై ఇచ్చిన తీర్పు కారణంగా నిలిపేశామన్నారు. ఈ మధ్యలో ఈ మొత్తం ప్రక్రియకు చాలా కాలాన్ని వెచ్చించామని, వార్డుల పునర్విభజన ప్రక్రియకు సైతం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందన్నారు. అందువల్ల డిసెంబర్ 15కల్లా ఎన్నికలను పూర్తి చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ముందుండే మొత్తం ప్రక్రియను డిసెంబర్ 15కల్లా పూర్తి చేస్తామని, ఆ తరువాత ఎన్నికల నిర్వహణకు మరో 45 రోజుల గడువు కావాలని కోరారు. దీని ప్రకారం జనవరి 31 కల్లా ఎన్నికల సంఘం ఎన్నికలను పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ మేరకు రాతపూర్వకంగా అఫిడవిట్ను తమ ముందుంచితే తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ విచారణను మధ్యాహ్నం 12.30కు వాయిదా వేసింది. వాయిదా అనంతరం జరిగిన విచారణ సందర్భంగా ఎన్నికల అధికారి హోదాలో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి కోర్టుకు హాజరై అఫిడవిట్ను ధర్మాసనం ముందుంచారు. అసాధారణ, గత్యంతరంలేని పరిస్థితులు ఎదురైతే తప్ప తాము చెప్పిన తేదీల్లో ఎన్నికలను నిర్వహిస్తామని అఫిడవిట్లో పేర్కొన్నారు. అఫిడవిట్తోపాటు ఏజీ ప్రకటనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం జనవరి 31కల్లా ఎన్నికలను పూర్తి చేయాలని ఈసీని ఆదేశించింది.
ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్ గురించి ప్రస్తావించగా అన్నీ తాము చూసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, కోర్టులో మధ్యాహ్నం విచారణ ప్రారంభమైనప్పుడు ఓ న్యాయవాది ఓటర్ల తొలగింపు అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాజ్యాల్లో తానూ వాదనలు వినిపించాలనుకుంటున్నానని, తామిచ్చిన ఫిర్యాదుతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల తొలగింపుపై విచారణ జరుపుతోందన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ దీనిపై పిటిషన్ దాఖలు చేశారా..? అని ప్రశ్నించగా ఆ న్యాయవాది లేదంటూనే వాదనలు కొనసాగించారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... పిటిషన్ దాఖలు చేయకుండా వాదనలు వినిపిస్తామంటే అంగీకరించబోమని తేల్చి చెప్పింది.