‘గీతం’ బైక్‌ | geetham's bike | Sakshi
Sakshi News home page

‘గీతం’ బైక్‌

Aug 24 2016 10:15 PM | Updated on Sep 5 2018 3:33 PM

బైక్‌ నడుపుతున్న విద్యార్థులు - Sakshi

బైక్‌ నడుపుతున్న విద్యార్థులు

నాలుగు చక్రాల మోటార్‌ సైకిల్‌ (ఆల్‌టెరైన్‌ వెహికిల్‌)ను గీతం విశ్వవిద్యాలయం మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు రూపొందించారు.

పటాన్‌చెరు: నాలుగు చక్రాల మోటార్‌ సైకిల్‌ (ఆల్‌టెరైన్‌ వెహికిల్‌)ను గీతం విశ్వవిద్యాలయం మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు రూపొందించారు. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ న్యూ ఇరా ఇంజినీరింగ్‌(ఐఎస్‌ఎన్‌ఈఈ) జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొనేందుకు ఈ వాహనాన్ని రూపొందించినట్టు విద్యార్థి బృందం నాయకుడు కె.సీతారామ్‌, మేనేజర్‌ నరేశ్‌, రైడర్‌ అయ్యప్పరెడ్డి, డిజైనర్‌ శరత్‌ తెలిపారు.

బీటెక్‌ మూడు, నాలుగో ఏడాది చదువుతున్న మొత్తం 28 మంది ఓ బృందంగా ఏర్పడి దాదాపు రూ.5 లక్షలతో ఆల్‌టెరైన్‌ వెహికల్‌ను రూపొందించినట్టు వారు చెప్పారు. నవంబర్‌లో వాహన రూపకల్పన ప్రారంభించామన్నారు. తొలుత కంప్యూటర్‌ డిజైన్‌ను నిర్వహకుల ఆమోదం పొందాక జూన్‌లో అసెంబ్లింగ్‌ ప్రారంభించామన్నారు. బైక్‌ ఇంజిన్‌ను ఐఎస్‌ఎస్‌ఈఈ సమకూర్చిందని, విడిభాగాలను గుజరాత్‌, అమెరికాతో సహా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించామన్నారు.

ఐదు గేర్లు, మూడు బ్రేకులు, డబుల్‌ షాఫ్ట్‌లు, థంబ్‌ యాక్సిలేటర్‌, కిల్లర్‌ స్విచ్‌లు వాహన ప్రత్యేకతలు. గంటకు 60 కిమీల వేగంతో ప్రయాణిస్తుందన్నారు. జాతీయ స్థాయి పోటీలో ఎనిమిది రౌండ్లు ఉంటాయని, ముందుగా ఆరడుగుల ఎత్తునుంచి బైక్‌ను వదలుతారని, ఆపై గంట సమయంలో ఆరుగురు విద్యార్థులు వాహనాన్ని విడదీసి జోడించాలన్నారు.

బ్రేక్‌ టెస్ట్‌, యాక్సిలేటర్‌ టెస్ట్‌, స్టీరింగ్‌ అలైన్‌మెంట్‌, యాన్యూరెన్స్‌, టెక్నికల్‌ ఇన్‌స్పెక‌్షన్‌తో పాటు 25 లీటర్ల పెట్రోల్‌తో నాలుగు గంటలు నిర్విరామంగా నడిపి తక్కువ ఇంధనం వినియోగించిన వారిని విజేతలుగా ప్రకటిస్తారని వారు వివరించారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ల్లో ఈ తరహా వాహనాలు ఎక్కువగా వినియోగిస్తారని, మనదేశంలో రోడ్లపై నడిపేందుకు నిషేధం ఉందన్నారు.

బైక్‌ బరువంతా మధ్యలో కేంద్రీకృతం కావడం వల్ల తిరగబడే అవకాశాలు తక్కువన్నారు. 45 నుంచి 50 డిగ్రీల ఉపరితలంపై(అంటే మెట్లపైనా) బైక్‌ను నడపొచ్చని తెలిపారు. విద్యార్థులను యూనివర్సిటీ డైరెక్టర్‌లు వీసీ ప్రొఫెసర్‌ ఎన్‌.శివప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.సంజయ్‌, మెకానికల్‌ విభాగాధిపతి డాక్టర్‌ పి.ఈశ్వరయ్య, గీతం డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, హెబీఎస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు అభినందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement