
గోదావరిలో 4 కోట్ల మంది పుణ్యస్నానాలు
గోదావరి పుష్కరాలలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఘాట్లలో నాలుగు కోట్ల మంది పుష్కర స్నానాలను ఆచరించారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ : గోదావరి పుష్కరాలలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఘాట్లలో నాలుగు కోట్ల మంది పుష్కర స్నానాలను ఆచరించారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని గుమ్మిర్యాల్ పుష్కర ఘాట్లో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం స్థానిక శ్రీకృష్ణ మందిరంలో ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుతోనే పుష్కరాలు ఇంత గొప్పగా సాగుతున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని సారించారన్నారు. పోలీసులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పుష్కరాలు ముగిసేనాటికి దాదాపు ఆరు కోట్ల మంది పుణ్య స్నానాలను ఆచరించే అవకాశం ఉందన్నారు. తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పుష్కరాలకు నిధులు కేటాయించి, నిర్వహణపై ప్రత్యేక దృష్టిని సారించిందని చెప్పారు.
గతంలో పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రి అని మాత్రమే ప్రచారంలో ఉందని ఇప్పు డు గోదావరి నది తీరం మొత్తం పుష్కరాలకు నిలయంగా మారిందన్నారు. భక్తులకు గ్రామాభివృద్ధి కమిటీలు, యువజన సంఘాలు ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ భక్తులు పుష్కర స్నానాలతో పునీతులవుతున్నారని అన్నారు.
పుష్కరాలు విజయవంతంగా సాగడానికి అధికారుల కృషి ఎంతో ఉందన్నారు. వీరి వెంట బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, మోర్తాడ్ జడ్పీటీసీ సభ్యురాలు ఎనుగందుల అమిత, వైస్ ఎంపీపీ జాగీరపు మోహన్ రెడ్డి, గుమ్మిర్యాల్ ఎంపీటీసీ సభ్యుడు గడ్డం లింగారెడ్డి, సర్పంచ్ గుండు లావణ్య, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజాపూర్ణనందం తదితరులు ఉన్నారు.