నకిలీ పాస్‌పుస్తకాలతో పంట రుణాలు | Forged signatures to Fake pass books with Crop loans | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్‌పుస్తకాలతో పంట రుణాలు

Jun 20 2016 8:47 AM | Updated on Oct 3 2018 6:52 PM

నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో సుమారు రూ.40 లక్షల పంటల రుణా లు పొందిన ఘటన మండలంలోని...

దుప్పెల్లిలో ఆలస్యంగా వెలుగులోకి...
ఆత్మకూరు (ఎం) :  నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో సుమారు రూ.40 లక్షల పంటల రుణా లు పొందిన ఘటన మండలంలోని దుప్పెల్లిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ప్రధాన రాజకీయ నాయకుడితో పాటు మరో 22 మంది రైతులు వలిగొండ మండలం అర్రూరులోని కెనరా బ్యాంక్ నుంచి ఈ పంట రుణాలను పొందారు. బ్యాంక్ నుంచి పంట రుణాలు కావాల్సి ఉండటంతో ఆ రైతులు ప్రధాన నాయకుడి అండదండలతో నకిలీ పాస్‌పుస్తకాలతో పాటు పహణీ  అడంగల్‌లను సృష్టించారు. ఇందుకు అక్కడి అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు సమాచారం.  
 
వెలుగులోకి వచ్చింది ఇలా...
ఈనెల 1న దుప్పెల్లి గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు సంబంధిత బ్యాంక్ హెడ్ ఆఫీస్ వరంగల్‌కు విచారణ నిమిత్తం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ ఫిర్యాదుతో అర్రూర్ బ్రాంచీ మేనేజర్ శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. పంట రుణాలు తీసుకున్న వారి జాబితాను గ్రామంలోని ఒక వ్యక్తికి అందజేయగా జాబితాలో ఉన్న వారిలో కొందరికి ఎటువంటి వ్యవసాయ భూములు లేనప్పటికీ రుణాలను పొందినట్లు, మరి కొందరు తక్కువ భూమి ఉండటంతో పాస్ పుస్తకం మీద ఎక్కువ భూమిని వైట్‌నర్‌ను ఉపయోగించి నమోదు చేసినట్లు తెలిసింది.

ఇందుకు అప్పటి తహసీల్దార్లు, ప్రస్తుత తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఇందిలా ఉండగా డ్యాక్యుమెంటనేషన్‌పైనే రుణాలు ఇచ్చినట్లు  అర్రూరు బ్రాంచీ మేనేజర్ నళిని తెలిపారు. దీనిపై రెవెన్యూ శాఖకు లేఖ ఇస్తామన్నారు.
 
విచారణ జరిపిస్తాం... : అలివేలు, తహసీల్దార్

ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలను సృష్టించిన ఉదంతంపై విచారణ జరుపుతాం. మాకు బ్యాంక్ నుంచి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement