తమిళనాడులో రోజుకు 5 షోలు.. విజయ్ ప్రభుత్వం నిర్ణయం
సాక్షి, చెన్నై: తమిళనాడులో రైతులకు రూ. 50 వేల వరకు రుణాలు మాఫీ చేస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం సీఎం విజయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి వినోద్, సహకార శాఖ మంత్రి వి. గాం«దీరాజ్, ఆరి్థక శాఖ మంత్రి ఎన్.మరియ విల్సన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఆర్బీఐ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని 01.05.2025 నుంచి 28.02.2026 వరకు సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణా లను మాఫీ చేయాలని సీఎం ఆదేశించారు. రూ.50 వేల వరకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తూ సంతకం చేశారు. అలాగే రూ. 50001 నుంచి లక్ష వరకు శ్లాబ్ల వారీగా విభజించి రూ.20వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 14,22,555 మంది రైతులు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం ప్రకటించింది.
రోజుకు 5 షోలకు అనుమతి
తమిళ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజయ్ను కలిసి థియేటర్లలో రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వాలని గత వారం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం విజయ్ 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు ఆటలు, స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవుదినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారు.


