చింతపల్లి ఎస్బీఐలో ఘరానా మోసం
భూమిలేని పేదల పేరిట ‘క్రాప్ లోన్’ దందా
బ్యాంకు ఎదుట బాధితుల నిరసన
మర్రిగూడ (చింతపల్లి): సెంటు భూమి కూడా లేని నిరుపేద కూలీల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి.. పంట రుణాలు మంజూరు చేసి లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారు నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఎస్బీఐ సిబ్బంది. 2024లో విధులు నిర్వహించిన బ్యాంకు మేనేజర్, మరికొంతమంది కిందిస్థాయి సిబ్బంది కలిసి పథకం ప్రకారం ఈ అక్రమాలకు తెరతీశారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.50 లక్షల చొప్పున పంట రుణాలను మంజూరు చేసి ఆ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసి.. క్షణాల్లో ఇతర ఖాతాలకు మళ్లించారు. మొత్తం మీద రూ.కోటికి పైగానే ఈ అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.
బంగారం విడిపించుకోవడానికి వెళ్తే షాక్..
చింతపల్లి మండలం హరిజనాపురం గ్రామానికి చెందిన ఓ ఖాతాదారుడు తాను బ్యాంకులో కుదవపెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి వెళ్లగా.. అతడి పేరిట రూ.1.50 లక్షల పంట రుణం బకాయి ఉందని సిబ్బంది చెప్పారు. అసలు తనకు భూమే లేదని, రుణం ఎలా ఇస్తారని ఆ ఖాతాదారుడు బ్యాంకు అధికారులతో వాదించడంతో నకిలీ బ్యాంకు ఖాతాల వ్యవహారం బయటపడింది.
కూలీల పేరిట భూమి ఉన్నట్లు సృష్టించి..
రోజువారీ కూలీల పేరిట ఏకంగా మూడు నుంచి నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. తీరా ఇప్పుడు బ్యాంకు ఉన్నతాధికారులు లోన్ రికవరీ కోసం బాధితుల ఇళ్లకు నోటీసులు పంపించడంతో అమాయక రైతులు, కూలీలు లబోదిబోమంటున్నారు. ఆన్లైన్లో చెక్ చేస్తే ఈ పాసుపుస్తకాల నంబర్లు ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఇవన్నీ బ్యాంక్ సిబ్బంది సృష్టించిన నకిలీవేనని స్పష్టమవుతోంది.
నాంపల్లి మండలం తుంగపాడుగౌరారం గ్రామానికి చెందిన ఓ మహిళ పేరున 194/1/2 సర్వే నంబర్లో మూడెకరాలు ఉండగా, హరిజనాపురం గ్రామానికి చెందిన దామెర విజయమ్మ పేరు పైన అదే సర్వే నంబర్ సబ్ డివిజన్పై నాలుగు ఎకరాలు ఉన్నట్లు నకిలీ పాసుపుస్తకం సృష్టించారు. భూమి లేని దాదాపు 60 మందికి పైగా నిరుపేదల పేరిట ఈ దందా చేయగా.. అందులో సగం మంది నుంచి బ్యాంకు సిబ్బంది లోన్ రికవరీ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, బ్యాంకు అధికారుల తప్పిదానికి మమ్మల్నెలా బాధ్యులను చేస్తారంటూ బాధితులు పెద్దఎత్తున చింతపల్లి ఎస్బీఐ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని, తమ పేరిట ఉన్న అక్రమ రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


