తెలంగాణ నుంచి మన జిల్లాలో విలీనమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది...
విలీన మండలాలకు ఎన్నికలు
May 2 2017 1:56 AM | Updated on Aug 14 2018 5:56 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలంగాణ నుంచి మన జిల్లాలో విలీనమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రెండు జెడ్పీటీసీ స్థానాలు, 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. వీటితోపాటు పెరవలి మండలం తీపర్రు ఎంపీటీసీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. వేలేరుపాడు, కుక్కునూరు జెడ్పీటీసీ స్థానాలకు, వేలేరుపాడులోని మేడిపల్లి, కాటుకూరు, నర్లవరం, తట్కూరుగొమ్ము, భూదేవిపేట, రేపాకగొమ్ము, రామవరం ఎంపీటీసీ స్థానాలకు, కుక్కునూరులోని అమరవరం, దామరచర్ల, మాధవరం, వింజరం, కివ్వాక, కుక్కునూరు–1, కుక్కునూరు–2, దాచారం ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 5న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. 5 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 9న స్కూృట్నీ చేస్తారు. తిరస్కరించిన నామినేషన్లను అభ్యర్థులు మరోసారి పరిశీలన కోసం 10న అప్పీల్ చేసుకోవచ్చు. 11న ఆప్పీళ్లపై విచారణ చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీ వరకు గడువు విధించారు. 21న పోలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ రీ పోలింగ్ జరపాల్సి వస్తే 22న చేపడతారు. 23వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ .రమేష్కుమార్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కుక్కునూరు రెవెన్యూ డివిజన్, పెరవలి మండలంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
Advertisement


