ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయొద్దు | Do not weaken public education | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయొద్దు

Dec 18 2016 2:05 AM | Updated on Sep 4 2017 10:58 PM

ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడానికే ప్రైవేటు యూనివర్సిటీల ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తుందని ప్రొఫెసర్‌ అంజిరెడ్డి అన్నారు.

నల్లగొండ రూరల్‌ : ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడానికే ప్రైవేటు యూనివర్సిటీల ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తుందని ప్రొఫెసర్‌ అంజిరెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పీఆర్‌టీయూ భవన్‌లో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు ప్రతిపాదనపై రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నేపథ్యాన్ని పక్కనబెట్టి మానవీయ విలువలు, సంబంధాలను దెబ్బతీసే విధంగా కార్పొరేట్‌ పెట్టుబడిదారులను ప్రోత్సహించడమే అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. రిలయన్స్, మహింద్రా, అశోక్‌ లీలాండ్, టాటా, బిర్లా వంటి సంస్థలు వ్యాపార లాభార్జన కోసమే వారి కంపెనీలు పనిచేస్తాయని, వారికి కావాల్సిన మ్యాన్‌ఫవర్‌ కోసం ప్రైవేటు యూనివర్సిటీలను పెడుతున్నాయన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, సైదులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ లేని తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చిన పాలకులు నేడు ఆబాధ్యతల నుంచితప్పుకుని బహుళజాతి కంపెనీలకు విద్యారంగాన్ని అప్పగిస్తున్నారని అన్నారు.

ఈ సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు విరమించుకోవాలని, ప్రభుత్వ యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలని, కేజీ టు పీజీ ఉచిత విద్యపై విధి విధానాలను ప్రకటించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, కొఠారి కమీషన్‌ సూచనమేరకు జీడీపీలో 6శాతం నిధులు ఖర్చు చేయాలని, కార్పొరేట్‌ విద్య సంస్థను రద్దు చేసి ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించి, ప్రభుత్వ రంగంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో వివిధ సంఘా ల ప్రతినిధులు పన్నాల గోపాల్‌రెడ్డి, కె.రత్నయ్య, వెంకటేశ్వర్లు, వెంకులు, లక్ష్మినారాయణ, సోమయ్య, ఇందూరు సాగర్, అశోక్‌రెడ్డి, మహేశ్, రమేష్, జి.వెంకన్నగౌడ్, ఎ.నాగయ్య, హరికృష్ణ, కేశవులు, పి.రవి, హరిందర్, మాదగోని, భిక్షపతి, ప్రభాకర్, నర్సింహ, రాజు తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement