కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన డిప్లొమా విద్యార్థులు అయోమయంలో పడ్డారు.
-
సీపీ ప్రకటనతో ఆందోళన
-
స్పష్టత ఇవ్వాలని డిమాండ్
వరంగల్ : కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన డిప్లొమా విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అర్హత పరీక్షలు రాసి పరుగు పందెంల్లో పాల్గొన్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో డిప్లొమా చదువుకున్న వారిని అన ర్హులుగా పరిగణించడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇంటర్మీడియెట్కు డిప్లొమా విద్యార్హత తత్సమానం కాదని పోలీసు అధికారులు తేల్చి చెబుతున్నారు. అర్హత పరీక్షల కోసం దరఖాస్తు సమయంలో పాలిటెక్నిక్ ఉత్తీర్ణత పేర్కొన్నామని, అప్పుడు పరీక్షలకు అనుమతించి ఇప్పుడు దేహదారుఢ్య పోటీలకు ఎందుకు అనుమతించడం లేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన అర్హత పరీక్షలకు తమకు సంబంధం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. వేలాది రూపాయాలు కోచింగ్ కోసం వ్యయం చేసి దేహదారుఢ్య, క్రీడాంశాల్లో అర్హత సాధించేందుకు రోజుల తరబడి శ్రమించినా లాభం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై అధికారుల స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.