
అన్ని బ్యాంకులకూ సమానంగా ఇవ్వండి
రిజర్వ్బ్యాంకు నుంచి వచ్చే కరెన్సీ నోట్లను అన్ని బ్యాంకులకూ సమానంగా పంపిణీ చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు.
- నగదు పంపిణీపై బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్ : రిజర్వ్బ్యాంకు నుంచి వచ్చే కరెన్సీ నోట్లను అన్ని బ్యాంకులకూ సమానంగా పంపిణీ చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశమైన ఆయన నోట్ల మార్పిడి సమయంలో ప్రజలకు కల్పిస్తున్న సేవలపై ఆరా తీశారు. చంటి పిల్లల తల్లులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పిల్లలకు పాలు అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వృద్ధులకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన వారికి నగదు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర జిల్లాల్లోని బ్రాంచులకు కరెన్సీని పంపించవద్దని సూచించారు. వివిధ బ్యాంకుల నుంచి నగదు తీసుకువచ్చేటప్పుడు పోలీసు సెక్యూరిటీ సేవలను బ్యాంకర్లు బుధవారం నుంచి ఉచితంగా పొందవచ్చన్నారు. ఏటీఎంలలో నగదు ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు కూడా అవసరం మేరకే బ్యాంకులకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.