గలగల.. వెలవెల | budget nill in khammam | Sakshi
Sakshi News home page

గలగల.. వెలవెల

Mar 29 2016 3:06 AM | Updated on Sep 3 2017 8:44 PM

గలగల.. వెలవెల

గలగల.. వెలవెల

ఖజానా ఖాళీ అయింది. బిల్లుల చెల్లింపునకు కష్టకాలమొచ్చింది.

ఖమ్మం ఖజానా ఖాళీ
నిలిచిపోయిన బిల్లులు
ఆంక్షలపై అయోమయం
ఆందోళనలో ఉద్యోగులు

 ఖమ్మం జెడ్పీసెంటర్ :  ఖజానా ఖాళీ అయింది. బిల్లుల చెల్లింపునకు కష్టకాలమొచ్చింది. ప్రభుత్వం వివిధ శాఖలకు అందించే ఖర్చులు.. పాలనకు సరిపడా నిధులు లేవు. దీంతో ఎక్కడి బిల్లులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల అంతరాయం కలుగుతోంది. జిల్లాలోని పలు శాఖలకు సంబంధించి ప్రతీ నెలా జీతాల బిల్లులు 25వ తేదీలోపు ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తారు. మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ కావడంతో ప్రభుత్వం చెల్లించే  చెల్లింపుల్లో కోత పెట్టేందుకే ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. దీంతో పలు శాఖల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చ ర్యలు సరిగా లేవని ఆరోపిస్తున్నారు. పలు శాఖల ఉద్యోగులకు రావాల్సిన కోట్ల రూపాయల టీఏ బిల్లులు నిచిపోయాయి. మెడికల్, ఆఫీస్ కాంటింజెన్సీ, మెయింటెనెన్స్ బిల్లులు కూడా ఆమోదానికి నోచుకోవడం లేదు.

ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు
పలు శాఖలకు చెందిన కొన్ని బిల్లులు మాత్రమే క్లియర్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే మిగతా బిల్లులు క్లియర్ చేయడం లేదని ట్రెజరీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే ఆయా శాఖల ఉద్యోగులు మాత్రం ట్రెజరీ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల బిల్లులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. కాగా, ట్రెజరీ నుంచి బిల్లుల క్లియర్ కోసం హాస్టల్ వార్డెన్, ఎయిడెడ్ ఉద్యోగులు, పోలీస్ శాఖ ఉద్యోగులు బారులు తీరారు. 31వ తేదీతో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, బిల్లులు క్లియర్ కాకపోతే చెల్లింపులు జరగవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయకపోతే మురిగిపోతాయని, ఇప్పట్లో అవి వచ్చే అవకాశం లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి అద్దె భవనాలు, స్టేషనరీ బిల్లులు, హాస్టల్ విద్యార్థుల సబ్బులు, నూనెల బిల్లులు పూర్తిగా నిలిచిపోయాయి.

 స్పష్టమైన ఆదేశాలు లేకే..
ఖజానా శాఖ నిర్లక్ష్యం వల్ల పలు శాఖల ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన బిల్లులపై ఫ్రీజింగ్ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ పేమెంట్ ద్వారా చెల్లింపుల విషయంలో ఉద్యోగులకు స్పష్టత లేదు. ఈ పేమెంట్ బిల్లులు అవుతున్నాయో లేదో చెప్పాలని ట్రెజరీ ఉద్యోగులను కోరినా.. సమాధానం చెప్పే వారే లేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేమెంట్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని పలు శాఖల ఉద్యోగులు కోరుతున్నారు. ఫ్రీజింగ్ లేదని ఒక వైపు చెబుతున్నప్పటికీ.. బిల్లులు పాస్ కాకపోవడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ వనరులు, ఖర్చు, ద్రవ్య వినియోగ బిల్లులపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement