‘బయో’త్పాతం
ఖరీప్ సీజన్ మొదలు కావడంతోనే మార్కెట్లోకి నకిలీ బయో ఉత్పత్తులు వెల్లువెత్తుతున్నాయి.
- జిల్లాలో నకిలీ బయో ఉత్పత్తులు
– వ్యవసాయాధికారుల దాడి
– రూ. 25 లక్షల విలువ చేసే మందులు సీజ్
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీప్ సీజన్ మొదలు కావడంతోనే మార్కెట్లోకి నకిలీ బయో ఉత్పత్తులు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు నగరాన్ని కేంద్రంగా చేసుకొని అక్రమార్కులు నకిలీల దందా నడుపుతున్నట్లు çస్పష్టం అవుతోంది. శనివారం గుట్టుచప్పుడు కాకుండా తరలుతున్న బయో ఉత్పత్తులను వ్యవసాయాధికారుల సీజ్ చేశారు. గోదాముపై దాడులు చేసి.. రూ.25 లక్షల విలువ చేసే బయో ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి ట్రాన్స్పోర్టు ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతుండటాన్ని వ్యవసాయాధికారులు గుర్తించారు.
కర్నూలు బాలాజీ నగర్లోని కేశవరెడ్డి స్కూల్ సమీపంలోని 72–1–72–5 నెంబరు ఇంటిపై కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, అగ్రానమీ ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి, కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్కుమార్రెడ్డి తదితరులు దాడి చేశారు. ఓసో కంపెనీకి చెందిన 15 రకాల బయోలను దివ్య ఎంటర్ప్రైజెస్ మార్కెటింగ్ చేస్తోంది. దీనిపై వ్యవసాయాధికారులకు కనీస సమాచారం కూడా లేదు. దొంగ ఉత్పత్తులు కావడం వల్లనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బయోల్లో పురుగుమందులు ఉన్నాయా అనే దానిని తేల్చేందుకు శ్యాంపుల్స్ తీసి ల్యాబ్కు పంపుతున్నట్లు వ్యవసాయాధికారి అశోక్కుమార్రెడ్డి తెలిపారు.