సీఎం చంద్రబాబు ఈనెల 6న ధర్మవరం, బుక్కరాయసముద్రం మండలాల్లో పర్యటిస్తున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ శశిధర్ ఆదేశించారు.
అనంతపురం అగ్రికల్చర్: సీఎం చంద్రబాబు ఈనెల 6న ధర్మవరం, బుక్కరాయసముద్రం మండలాల్లో పర్యటిస్తున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ శశిధర్ ఆదేశించారు. ఆదివారం రెవెన్యూభవన్లో కలెక్టర్ జేసీ–1 బి.లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, డీఆర్ఓ హేమసాగర్తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ధర్మవరంలో చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర స్థాయి సదస్సుతో పాటు రైల్వే ఓవర్బ్రిడ్జి ప్రారంభోత్సవం ఉంటుందన్నారు.
అలాగే బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓ) రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మవరం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ జెడ్పీ సీఈఓ రామచంద్ర, పట్టుశాఖ జేడీ అరుణకుమారి, అలాగే బుక్కరాయసముద్రం ఏర్పాట్లు జేసీ–2 ఖాజా మొహిద్దీన్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్, రహదారులు, పరిశుభ్రత, అంబులెన్సులు, ఫైరింజన్లు తదితర వాటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. కళాజాత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ ఎ.నాగభూషణం, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ట్రాన్స్కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వ్యవసాయశాఖ డీడీఏ జయచంద్ర పాల్గొన్నారు.