శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత | All set for Tirumala brahmotsavalu | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

Sep 25 2016 7:12 PM | Updated on Aug 18 2018 6:24 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భద్రత పటిష్టం చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు అన్నారు.

- ఏపీ డీజీపీ సాంబశివరావు
- ఆలయ వీధుల్లో భద్రత ఏర్పాట్ల తనిఖీ


తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భద్రత పటిష్టం చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ వీధుల్లో సాగుతున్న బ్రహ్మోత్సవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని కితాబిచ్చారు.

ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్ ఇనుప కంచె కారణంగా భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు ఉండే అవకాశం లేదన్నారు. టీటీడీ విజిలెన్స్, అర్బన్ జిల్లా పోలీసు విభాగాలు సమన్వయంతో భద్రతను కట్టుదిట్టం చేశాయన్నారు. తిరుమల ఆలయ ఆగమ శాస్రాల ప్రకారం డ్రోన్లు వినియోగించలేమన్నారు. ఈ సారి బందోబస్తుతోపాటు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటామన్నారు.

సీసీ కెమెరాల నిఘాతోపాటు ప్రింట్స్‌తో అనుమానితులను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. భక్తుల సేవ కోసం ప్రత్యేంగా 150 మంది సిబ్బందితో 'పోలీస్ సేవాదళ్' ఏర్పాటు చేశామన్నారు. చైల్డ్ ట్రాకింగ్ పద్ధతి అమలు ద్వారా చిన్నారులు తప్పిపోయినా త్వరగా వారి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న దుర్ఘటనల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ యూనిట్ ప్రారంభించామన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల కొరత తీవ్రంగా ఉందని, 8 మంది అదనపు డీజీలు, 25 మంది ఐజీలు మాత్రమే ఉన్నారన్నారు. అందువల్లే టీటీడీకి శాశ్వత సీవీఎస్‌వో పోస్టు నియమించలేదని, త్వరలోనే సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. తిరుమల భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసే అవకాశం లేదన్నారు. ఆయన వెంట ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ ప్రభాకర్‌రావు, టీటీడీ సీవీఎస్‌వో శ్రీనివాస్, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్‌పి జయలక్ష్మి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement