శివారు పల్లెలు.. ఇక పురపాలికలు! | 11villages now ghmc Municipalities | Sakshi
Sakshi News home page

శివారు పల్లెలు.. ఇక పురపాలికలు!

Apr 7 2016 3:18 AM | Updated on Mar 28 2018 11:26 AM

శివారు పల్లెలు.. ఇక పురపాలికలు! - Sakshi

శివారు పల్లెలు.. ఇక పురపాలికలు!

శివారు పల్లెలకు ఇక పట్నం కళ రానుంది. రాజధాని చేరువలోని 11 గ్రామ పంచాయతీలను పురపాలికలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

11 గ్రామాలపై ఉత్కంఠకు తెర
నగర పంచాయతీలుగా మార్చేందుకే మొగ్గు
నేడో, రేపో డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : శివారు పల్లెలకు ఇక పట్నం కళ రానుంది. రాజధాని చేరువలోని 11 గ్రామ పంచాయతీలను పురపాలికలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొంతకాలంగా ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న ఈ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించాలా? నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలా అనే అంశంపై సుదీర్ఘ కసరత్తు జరిపిన ప్రభుత్వం.. ఎట్టకేలకు వీటిని మున్సిపాలిటీ లుగా మార్చేందుకే మొగ్గు చూపుతోంది.

ఈ క్రమంలోనే ఘట్‌కేసర్ మండలంలోని మేడిపల్లి, పర్వతాపూర్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, చెంగిచర్లతోపాటు సరూర్‌నగర్ మండలంలోని మీర్‌పేట్, జిల్లెలగూడ, జల్‌పల్లి, కొత్తపేట్, పహడీషరీఫ్, బాలాపూర్(పార్ట్)ను నగర పంచాయతీలుగా మార్పు చేయనుంది. ఈ మేరకు ఆయా గ్రామాలను పంచాయతీరాజ్‌శాఖ పరిధి నుంచి తప్పిస్తూ (డీనోటిఫై) ఫైలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయా మండలాలు,  పంచాయతీలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పనిచేస్తున్న స్థానిక సంస్థల ప్రతినిధులు తమ పదవీకాలం పూర్తికాక ముందే డీనోటిఫై వ్యవహారాన్ని సవాల్ చేస్తూ కోర్టు మెట్లు ఎక్కే అవకాశం లేకపోలేదు.

 ఆరు నెలలుగా అనిశ్చితి..
నగరీకరణ నేపథ్యంలో 11 పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం లేదా నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలా అనే అంశాన్ని తీవ్రంగా పరిశీలించిన గత ప్రభుత్వం వీటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. అదేసమయంలో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయినప్పటికీ సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడంలేదని, సర్పంచ్ ఎన్నికలైనా నిర్వహించాలి లేదా నగర పంచాయతీలుగా మార్చే అంశ ంపై త్వరితగతిన నిర్ణయాన్ని తీసుకోవాలని స్థానికులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం తక్షణమే వీటికి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పంచాయతీలకు ఎంపీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఉన్నఫళంగా నగర పంచాయతీలుగా మారిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వం ఆరు నెలలుగా ఈ అంశాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుతూ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై కాలయాపన తగదని, త్వరగా తేల్చమని ఆదేశించింది. దీంతో కదలిన సర్కారు.. ఈ పంచాయతీలను డీనోటిఫై చేస్తూ ఫైలును సిద్ధం చేసింది. దీనికి సంబంధించి నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. పంచాయతీరాజ్‌శాఖ నుంచి డీనోటి ఫై అయిన అనంతరం ప్రతిపాదిత నగర పంచాయతీల జాబితాను పురపాలకశాఖ తయారు చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement