యువ జంట ఆత్మహత్యాయత్నం

youth attempt suicide; boy dies, girl critical in Guntur district - Sakshi

     యువకుడు మృతి, ప్రాణాపాయ స్థితిలో యువతి 

     కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు 

     కొద్దిరోజుల కిందటే వీరికి నిశ్చితార్థం 

సాక్షి, మాచర్ల రూరల్‌: కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ జంట.. కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో యువకుడు మృతిచెందగా.. యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొప్పునూరులో వలంటీర్‌గా పనిచేస్తున్న కేతావత్‌ శివా నాయక్‌ (22)కు, రెంటచింతల మండలం పశర్లపాడుకు చెందిన జఠావత్‌ అనితతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మాచర్ల పట్టణంలోని ఓ కళాశాలలో అనిత డిగ్రీ చదువుతోంది. వేసవి సెలవుల్లో వివాహం జరిపించాలనుకున్నారు. 

ఈ నేపథ్యంలో అనిత కుటుంబంలో ఏర్పడ్డ స్వల్ప విభేదాలతో కలత చెందిన శివానాయక్, అనితలు గురువారం కంభంపాడు కుడికాలువలో దూకారు. అక్కడ పొలం పనులు చేసుకుంటున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడికి చేరుకుని కాలువలో కొట్టుకుపోతున్న ఇద్దరినీ రక్షించేందుకు అక్కడే ఉన్న కొంతమందిని పురమాయించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శివా నాయక్‌ కొట్టుకుపోగా.. కొన ఊపిరితో ఉన్న అనితను ఒడ్డుకు చేర్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివా నాయక్‌ మృతదేహాన్ని కాలువలో గాలించి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సిన తమ పిల్లలకు ఈ దుస్థితేంటంటూ ఇరు కుటుంబాల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top