నా ప్రేమకు సెలవు | Young Man Committed Suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థి అనుమానాస్పద మృతి

Jul 26 2018 3:50 PM | Updated on Sep 2 2018 4:52 PM

Young Man Committed Suicide  - Sakshi

వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోఉగిరి హర్షవర్ధన్‌ (ఫైల్‌) 

టెక్కలి రూరల్‌/కాశీబుగ్గ/వీరఘట్టం: వన్‌సైడ్‌ లవ్‌ ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని బలిగొంది. తనలోని ప్రేమభావాలను బహిర్గతం చేయలేని ఓ యువకుడు తనలో తానే కుమిలిపోతూ చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం టెక్కలి సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. వీరఘట్టంకు చెందిన ఉగిరి హర్షవర్ధన్‌(19) టెక్కలి సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సెకెండియర్‌(మెకానికల్‌ ఇంజినీరింగ్‌) చదువుతున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తూ.. ఆ విషయం ఆమెకు చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. యువకుడి సెల్‌ఫోన్‌ వాట్సాఫ్‌ ప్రొఫైల్‌లో ‘నాప్రేమకు సెలవు’ అనే ఫొటో పెట్టడంపై ఈ మృతి వెనుక ప్రేమ వ్యవహారమే నడిచిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టెక్కలిలో మృతదేహం గుర్తింపు..

టెక్కలి మండలం రావివలస సమీపంలోని రైలు పట్టాలపై బుధవారం ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనంతరం జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు.

జీఆర్‌పీ కానిస్టేబుల్‌ కోదండరావు ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాగా, మెడ మీదుగా రైలు వెళ్లినా తల, మొండెం దగ్గరగానే ఉండటంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

వీరఘట్టంలో విషాదఛాయలు..

హర్షవర్ధన్‌ మృతి వార్త వినగానే స్వగ్రామం వీరఘట్టంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుమారుడు ఇక లేడనే సమాచారం తెలిసి తల్లిదండ్రులు రాంప్రసాద్, మణమ్మలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతిచెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే కుటంబు సభ్యులు, బంధువులు పలాస బయలుదేరివెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement