ప్రేమలో గెలిచి... జీవితంలో ఓడి

Woman Commit Suicide In Adilabad - Sakshi

సాక్షి, లక్ష్మణచాంద(నిర్మల్‌): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి నాలుగు నెలలకే శవమైంది. ప్రేమలో గెలిచినా జీవితంలో ఓడిపోయింది. ప్రేమించిన వాడే ముఖ్యమని తల్లిదండ్రులను వదిలిపెట్టింది. అంతలోనే అత్తింటి వేధింపులతో  తనువు చాలించింది. మండలంలోని రాచాపూర్‌ గ్రామానికి చెందిన పరమేష్‌ నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన రాజేశ్వర్‌రెడ్డి – మంజుల మూడో కుమార్తె  కావ్య(24) గత నవంబర్‌ 1, 2019న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కావ్య అత్తవారింటనే ఉంటూ జిల్లా కేంద్రంలోని సెయింట్‌తోమస్‌ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో దూలానికి చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కావ్య తల్లిదండ్రులకు ఉదయం 10గంటలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందచేశారు. ఘటన స్థలంకు చేరుకున్న  తల్లిదండ్రులు, బంధువులు కావ్యను చూసి మృతదేహం వద్ద బోరున విలపించారు.

కుటుంబ సభ్యుల అనుమానం...
కావ్య కుటుంబ సభ్యులు మాత్రం కావ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె వరకట్నం వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. తను చాలా దైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అత్తింటి వారే తమకూతురుచావుకు కారణమని తెలిపారు. 

ముగ్గురుపై కేసు నమోదు 
కావ్య తల్లి మంజుల  ఫిర్యాదు మేరకు కావ్య భర్త పరమేష్, భావ, అత్తపై ఐపీసీ సెక్షన్‌ 304బీ ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సంఘట స్థలాన్ని సోన్‌ సీఐ జీవన్‌రెడ్డి, తహసీల్దార్‌ సత్యనారాయణరావు, ఇన్‌చార్జి ఎస్సై పరిశీలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top