టెంపోపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి

Truck Collide With Tempo in Maharashtra 13 Dead - Sakshi

ముంబై : మహారాష్ట్రలోని బుల్ధానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు టెంపోపైకి దూసుకొచ్చిన ఘటనలో 13 మంది అక్కడిక్కడే మృతి చెందారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. వివరాలు.. మల్కాపూర్‌ నుంచి అనురాబాద్‌ వెళ్లేందుకు కొంతమంది వ్యక్తులు టెంపోలో బయల్దేరారు. అదే సమయంలో బుల్దానా హైవే మీదకు వచ్చిన ఓ ట్రక్కు టైర్‌ పేలిపోయింది. అయితే ట్రక్కు అధిక వేగంతో ప్రయాణిస్తున్న కారణంగా పల్టీలు కొట్టి ఎదురుగా వస్తున్న టెంపోపై పడింది. దీంతో టెంపో నుజ్జనుజ్జయింది.

ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్‌ చేయడంతో పాటుగా పోలీసులకు సమాచారం అందించారు. ట్రక్కు కింద ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో జేసీబీని తీసుకువచ్చి టెంపోపై నుంచి ట్రక్కును తొలగించారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top