నాగవైష్ణవి హత్య కేసు నేడు తుది తీర్పు

Today is the final judgment of Nagavishnavi Murder case - Sakshi

     విజయవాడ కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు 

     2010లో దారుణ హత్యకు గురైన నాగవైష్ణవి 

     నిప్పుల కొలిమిలో పడేసి కాల్చేసిన రా‘బంధువు’లు

     ఆ దిగులుతో మృత్యువాత పడిన చిన్నారి తండ్రి పలగాని ప్రభాకర్‌

విజయవాడ: ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది. విజయవాడలో మహిళా సెషన్స్‌ జడ్జి గురువారం ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనున్నారు. కోర్టు వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. విజయవాడకు చెం దిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్‌ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న దారుణ హత్యకు గురైంది. హత్య జరిగే నాటికి ఆమె వయస్సు పదేళ్లు.

పల్లగాని ప్రభాకర్‌పై కోపంతో ఆయన కుమార్తె వైష్ణవి స్కూల్‌కు వెళ్తుండగా నిందితులు బలవంతంగా గుంటూరు తీసుకువెళ్లి ఇనుము కరగబెట్టే నిప్పుల కొలిమిలో ఆమెను పడేసి కాల్చేశారు. నాగవైష్ణవి హ్యతకు గురికాగానే పుత్రికాశోఖంతో పల్లగాని ప్రభాకర్‌ కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్‌ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్‌ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు.

పల్లగాని ప్రభాకర్‌ మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ కేసులో ఏ3గా ఉన్నారు. నిందితులపై పోలీసులు ఐపీసీ 302, 307, 364, 201,427, 379, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top