కీచకోపాధ్యాయుడు

Teachers And Students Complaints Against Headmaster in Anantapur - Sakshi

 ఉపాధ్యాయినిలు, విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన

కులం పేరుతో దూషణలు

వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

హెచ్‌ఎం నటరాజ్‌ను అరెస్ట్‌కు వెనుకంజ

సస్పెండ్‌ చేయాలంటూ సీఎం కార్యాలయం నుంచి ఉత్తర్వులు

తండ్రి తర్వాత తండ్రిలా వ్యవహరించాల్సిన ప్రధానోపాధ్యాయుడు గతి తప్పాడు.విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సమయంలో సహ ఉపాధ్యాయినిల పట్ల కీచకుడిగా మారాడు. ఈ పరిస్థితి ఎక్కడో కాదు.. తాడిపత్రిలోని టైలర్స్‌ కాలనీలో ఉన్న శ్రీ ప్రకాశం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలోనిది. ప్రధానోపాధ్యాయుడివైఖరితో విసుగు చెందిన బాధితులు వారం రోజుల క్రితం  పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం      దక్కలేదు. కీచకోపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేయాల్సిన పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు.చివరకు సమస్యపై స్పందించిన సీఎం పేషీ.. తక్షణమేఆ కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలంటూ ఉత్తర్వులుజారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 

అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ ప్రకాశం మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.నటరాజ్‌ వైఖరి వివాదస్పదంగా మారింది. వందల సంఖ్యలో ఇక్కడ బాల, బాలికలు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి నుంచి హెచ్‌ఎం వరకూ ఐదేళ్లుగా ఈ పాఠశాలలో పనిచేస్తూ వస్తున్న నటరాజ్‌..  తరగతి గదుల్లో పాఠాలు చెప్పకుండా అనుచిత ప్రవర్తనలతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అతని వెకిలి చేష్టలకు చిన్నారుల మనసులు గాయపడ్డాయి. విషయాన్ని తల్లిదండ్రులకు గాని, ఇతరులకు గాని చెబితే హాజరుపట్టిలో అబ్సెంట్‌ వేస్తానని బెదిరిస్తూ తన పబ్బం గడుపుకుంటూ వచ్చాడు.   

మాట కాదంటే పైశాచికం
తన మాట వినలేదన్న అక్కసుతో  గతంలో ఎనిమిదో తరగతి విద్యార్థి వెంకటరమణను నటరాజ్‌ తీవ్రంగా చితకబాదాడు. ఘటనలో వెంకటరమణ చెయ్యి విరిగింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రూ.30 వేలు చెల్లిస్తూ దుప్పటి పంచాయితీతో బయటపడ్డాడు. స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉంటూ వచ్చిన నటరాజ్‌ ఈ ఏడాది జూన్‌ 19న ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్‌ పొంది, తిరిగి ఇదే పాఠశాలలో బాధ్యతలు స్వీకరించాడు. హెచ్‌ఎం అన్న అహంకారంతో అతను మరింత రెచ్చిపోతూ.. ఈ సారి ఏకంగా ఉపాధ్యాయినులను టార్గెట్‌ చేస్తూ వచ్చాడు. అతని వెకిలి చేష్టలతో విసుగు చెందిన ఉపాధ్యాయినులు.. గ్రీవెన్స్‌లో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అతన్ని అప్పటి తహసీల్దార్‌ రామకృష్ణారెడ్డి, ఎంఈఓ, మున్సిపల్‌ కమిషనర్‌ తీవ్రంగా మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు.  ఉపాధ్యాయినుల పట్ల మరింత వేధింపులు మొదలయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో మహిళా టీచర్లు ఇబ్బంది పడుతూ వచ్చారు. తన మాట వినకపోతే కులం పేరుతో దూషిస్తున్నాడంటూ నటరాజ్‌పై ఇద్దరు మహిళా టీచర్లు ఈ నెల 9న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు కానీ, నటరాజ్‌ అరెస్ట్‌ చూపలేకపోయారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటరాజ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలంటూ ఈ నెల 11న సీఎం పేషీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. విషయం తెలుసుకున్న నటరాజ్‌ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top