సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్యాయత్నం

Suicide attempt by Couple - Sakshi

కాళేశ్వరం(మంథని) : సహజీవనం చేస్తున్న ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో బుధవారం జరిగింది. వారిలో పురుషుడు మృతిచెందగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన జంగా హరినాథ్‌(48) మొదటి భార్య మృతిచెందడంతో మల్హర్‌ మండలం కొయ్యూర్‌కు చెందిన శ్యామలతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే వారిద్దరు కలిసి ఉండడం ఇష్టం లేని శ్యామల చిన్న సోదరుడు పండ్ల రాము పలుమార్లు వారిపై దాడి చేశాడు. కలిసి ఉండొద్దని బెదిరించాడు. అయినా వారు కలిసే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే అతడి వేధింపులు భరించలేక ఇద్దరు బుధవారం ఉదయం 7.30 గంటలకు కాళేశ్వరంలోని గోదావరి నదిలో వీఐపీ ఘాట్‌ వద్ద క్రిమిసంహారక మందు తాగారు. హరినాథ్‌ అక్కడికక్కడే మృతిచెందగా, శ్యామల అపస్మారక స్థితికి చేరింది. స్థానికులు గమనించి 108లో మహదేవపూర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ‘మిమ్మల్ని నేనే చంపాలా.. మీరే చస్తారా’ అని రాజు బెదిరించడంతో తాము మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హరినాథ్‌ రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ సంఘటన స్థలంలో ఓ చేతి సంచిలో వారిద్దరి ఫొటోలతో కలిపి లభించింది. కాగా హరినాథ్‌ మొదటి భార్య కుమారుడు ప్రసన్నకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రామ్‌సింగ్‌ తెలిపారు. మృతుడు స్థానికంగా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పలిమెల ఎస్సై నరేష్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 

సూసైడ్‌ నోట్‌లో ఇలా..
శ్యామల చిన్న తమ్ముడు పండ్ల రాజు తరచు మా ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేశాడు. ఇద్దరిని కొట్టి దూరం చేశాడు. అయినా మేమిద్దరం ఒక్కటయ్యాం. చంపుతానని  బెదిరించాడు. మీరే చావండి లేదా నేనే చంపుతా అని వేధించడంతో మనస్తాపానికి గురై సూసైడ్‌ చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top